హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమకాలకు సంబంధించి దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్లో పెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరాదే, జస్టిస్ జె అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించాలని గత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రివర్గం చేసిన సిఫార్సులను తమిళిసై తిరస్కరించిన సంగతి తెలిసిందే.
గవర్నర్ కోటా కింద ఎవరిని అయినా ఎమ్మెల్సీలుగా నియమించాలని కేబినెట్ సంతృప్తి చెంది ఆమోదిస్తే.. ఆ పేర్లను గవర్నర్ ఆమోదించడం తప్ప వేరే మార్గం ఉండదని కుర్ర సత్యనారాయణ తరఫు సీనియర్ న్యాయవాది మయూర్ హైకోర్టులో వాదించారు. ఎమ్మెల్సీ నియామక వ్యవహారంపై ఏం జరిగినా అందుకు మంత్రివర్గానిదే బాధ్యతని స్పష్టం చేశారు. కుర్ర నామినేషన్ను గవర్నర్ తిరసరించడాన్ని వివక్ష, పక్షపాత చర్యగా అభివర్ణించారు.
మంత్రి మండలి నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్కు లేదని చెప్పారు. రాజ్యాంగ పరిధులకు లోబడే గవర్నర్ విధులు నిర్వహించాలని, వ్యక్తిగత అభిప్రాయాలతో నిర్ణయాలు తీసుకోరాదని చెప్పారు. మంత్రివర్గం సిఫార్సులను తిరసరించే అధికారం గవర్నర్కు లేదని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ సిఫార్సులను పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వానికి పంపవచ్చునని అన్నారు. సిపార్సులను వెనక్కి పంపలేదని, రాజ్యాంగ విరుద్ధంగా తిరస్కరించారని తప్పుపట్టారు ఈ చర్యను సాధారణ అంశంగా పరిగణించకూడదని, అరుదైన ప్రత్యేక కేసుగా పరిగణించాలని కోరారు. ఇదొక ప్రత్యేకమైన కేసుగా పేరొన్నారు.
రాజకీయాల్లో ఉన్నందున దాసోజు శ్రవణ్కుమార్ పేరును తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులనే పిటిషనర్ కుర్ర సత్యనారాయణ విషయంలోనూ చేశారని తప్పుపట్టారు. దాసోజు విషయంలో జారీ చేసిన ఉత్తర్వులనే యథాతథంగా కుర్ర వ్యవహారంలోనూ జారీ చేశారన్నారు. రాజకీయాల్లో ఉన్నారన్నది తిరస్కరించడానికి కారణం కాదన్నారు. ఇదే నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉంటే తాజాగా మంత్రివర్గం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ కోదండరాం విషయంలో గవర్నర్ ఏవిధంగా ఆమోదించారో చూడాలని కోరారు. గవర్నర్ చర్య వివక్షాపూరితంగా ఉందని చెప్పడానికి కోదండరాం వ్యవహారంలో గవర్నర్ ఆమోదమే నిదర్శనమన్నారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.