హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి హైకోర్టులో భంగపాటు ఎదురైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశ చూపి పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ బ్రోకర్లను కాపాడుకొనేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. రాష్ట్ర పోలీసుల చేతి నుంచి ఈ కేసు దర్యాప్తును లాక్కొని తమ ఆధీనంలోని సీబీఐకి అప్పగించాలన్న కుట్ర భగ్నమైంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసు దర్యాప్తును కొనసాగించేందుకు సమ్మతిని తెలియజేసింది.
సిట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ధర్మాసనం.. దర్యాప్తును హైకోర్టు జడ్జి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీచేసింది. మొయినాబాద్ ఫాంహౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రపై తెలంగాణ పోలీసులకు బదులుగా సీబీఐ లేదా హైకోర్టు నియమించిన సిట్తో దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు ఏడెనిమిది నిమిషాలపాటు తమ చాంబర్లోకి వెళ్లి చర్చించుకొని వచ్చి తుది తీర్పు వెలువరించారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తును నిలిపివేయాలన్న బీజేపీ అభ్యర్థనను తోసిపుచ్చారు. సింగిల్ జడ్జి వద్ద ఉన్న కేసులో తుది ఉత్తర్వులు వెలువడే వరకైనా పోలీసుల దర్యాప్తును నిలుపుదల చేయాలన్న వినతిని సైతం తిరసరించారు. క్రిమినల్ కేసులో నిందితులు కానివాళ్లు వ్యాజ్యం ఎలా దాఖలు చేస్తారని బీజేపీ నేతను ప్రశ్నించారు.
‘మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత పోలీసులు అకడ లభ్యమైన వీడియోలు, ఆడియోలు, కెమెరాల్లోని ఫుటేజీలు వంటి మెటీరియల్ను జప్తు చేసినప్పుడు అవి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి వెళ్లాయి. అందువల్ల ఇకపై దర్యాప్తు గోప్యంగా ఉండాలి’ అని కోర్టు స్పష్టంచేసింది. ‘సిట్ ఏ వివరాలు ఎవరికీ చేరకుండా చర్యలు తీసుకోవాలి. సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షించాలి. ఈ నెల 29న సింగిల్ జడ్జి ఈ కేసును విచారణ చేసే సమయంలో దర్యాప్తు ప్రాథమిక నివేదికను సిట్ చైర్మన్ అందజేయాలి. దర్యాప్తు పురోగతిని సిట్ ఎప్పటికప్పుడు సీల్డ్ కవర్లో సింగిల్ జడ్జికి నివేదించాలి. సీవీ ఆనంద్ మినహా ఇతరులెవరూ కేసు (క్రైం నెం 455/2022) దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు. సిట్ దర్యాప్తునకు పూర్తి స్వేచ్ఛ. దర్యాప్తు వివరాలను ఉన్నతాధికారులకు లేదా రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియజేయకూడదు. ఏవైనా వివరాలు లీక్ అయితే అందుకు సిట్ చైర్మన్ సీవీ ఆనంద్ బాధ్యత వహించాల్సి వస్తుంది. మొయినాబాద్ ఫాంహౌస్ దర్యాప్తులో సిట్ ముందుకు వెళ్లొచ్చు. బీజేపీ రిట్ అప్పీల్ పరిషారమైంది. ఇదే తరహా పిటిషన్లు ఏమైనా ఉంటే వాటికి కూడా ఈ ఉత్తర్వులే వర్తిస్తాయి. పశ్చిమబెంగాల్ వర్సెస్ కమిటీ ప్రొటెక్షన్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి ఈ ఆదేశాలను జారీ చేస్తున్నాం’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న సీడీ, వీడియో, ఆడియో కాపీలు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడి చేతికి ఎలా అందాయని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై దుష్యంత్ దవే స్పందిస్తూ, ఈ కేసులోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక కేసుల్లో ఈ విధంగానే మీడియాలో మొత్తం వస్తున్నదని తెలిపారు. ఈ కేసులో సమాచారం, ఆడియో, వీడియోల వివరాలు బయటకు రావడం దురదృష్టకరమని అంటూ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. క్రిమినల్ కేసుకు సంబంధం లేనివాళ్లు ఆ కేసు విచారణ ఎలా ఉండాలో కోరే అర్హత లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని గుర్తుచేశారు. క్రిమినల్ కేసు దర్యాప్తు మొదలైన తర్వాత మధ్యలో ఆపేందుకు వీల్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నదని చెప్పారు. థర్డ్ పార్టీ రిట్ వేయడానికి బీజేపీకి అర్హత లేదన్నారు. దర్యాప్తు ఏకపక్షంగా సాగుతున్నదనేందుకు బీజేపీ ఒక్క ఆధారం కూడా చూపలేదని చెప్పారు. ఈ కేసులో తమ పరువు ప్రతిష్ఠలు మసకబారుతాయని బీజేపీ ఆందోళన వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉన్నదని అన్నారు. రిమాండ్ డైరీలో అక్టోబర్ 26న పంచనామా జరిగితే అందులో మధ్యవర్తులు 27న సంతకాలు చేశారనే సందేహాన్ని బీజేపీ లేవనెత్తడాన్ని దవే తోసిపుచ్చారు. 26న మొదలైన పంచనామా 27న ఉదయం 8.30 గంటల వరకు కొనసాగిందని తెలిపారు.
క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును నిలిపివేయాలని కోర్టులు ఉత్తర్వులు జారీ చేయబోవని, నిందితులను అరెస్ట్ చేయవద్దనో, కఠిన చర్యలు తీసుకోవద్దనో మాత్రమే ఉత్తర్వులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరిందని, అకడ స్టే రాలేదని, ఏసీబీ కోర్టు సైతం నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిందని తెలిపారు. నీహారిక ఇన్ఫ్రా కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు దర్యాప్తును నిలిపివేసేందుకు వీల్లేదన్నారు. తాజాగా బీమా కోరేగాం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం కూడా ఈ కేసు దర్యాప్తును ఆపాల్సిన అవసరం లేదన్నారు. ఫాంహౌస్లో అనేక సాక్ష్యాధారాలు లభించాయని చెప్పారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయాల్సివుందని, నిందితుల వెనుక ఎవరున్నారో కూడా తేల్చాల్సి ఉన్నదని తెలిపారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం అవసరం లేదని, బీజేపీ రిట్ అప్పీల్ పిటిషన్ను డిస్మిస్ చేయాలని కోరారు. బీజేపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్ చిదంబరం వాదిస్తూ, తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహిరిస్తున్నారని, కోర్టు ధిక్కారణ చర్యలు ఉన్నాయని అంటూ దవే చెప్పని విషయాలను ప్రస్తావించారు. ఇందుకు దవే తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇదే సమయంలో హైకోర్టు స్పందిస్తూ, క్రిమినల్ కేసులో నిందితులే తమ అభ్యంతరాలు చెప్పే వీలుందని, ఈ కేసులో బీజేపీ ఎలా రిట్ దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. బీజేపీ పేరును పలుసార్లు కేసులో ప్రస్తావించినందున తమకు రిట్ దాఖలు చేసే అర్హత ఉన్నదని వైద్యనాథన్ చెప్పారు. కికిరిసిన కోర్టు హాల్లో సుమారు గంటపాటు వాదప్రతివాదనలు జరిగాయి.
కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసిందని, అదేవిధమైన కుట్ర తెలంగాణలో కూడా జరిగిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దవే.. బీజేపీ తెరవెనుక చేసిన ప్రయత్నాలపై సిట్ దర్యాప్తు సక్రమంగానే కొనసాగుతున్నదని తెలిపారు. ‘ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు జరిగిన కుట్ర భగ్నం కావడంతో ఆ కేసులో నిందితుడు కాని బీజేపీ నాయకుడు హైకోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. నేరాభియోగాలతో సంబంధం లేదంటూనే కేసును కొట్టేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు. ప్రతిపక్ష (బీజేపీయేతర) పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల మంత్రులను కూడా జైళ్లకు పంపుతున్నారని, ఇకడ కూడా బీజేపీ అదే చేయాలని చూసిందని తెలిపారు. క్రిమినల్ కేసులో దర్యాప్తు ఆపాలని బీజేపీ కోరడం సిగ్గు చేటని అన్నారు. బీజేపీలో చేరాలని కోట్ల రూపాయలను ఎర వేసిన నిందితుల పట్ల బీజేపీకి ప్రేమ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. నిజంగానే నిందితుల ఉచ్చులో ఎమ్మెల్యేలు పడి మనసు మార్చుకుని ఉంటే సెవెన్ స్టార్ హోటల్స్లో క్యాంపు నిర్వహించేవాళ్లని చెప్పారు. అదే జరిగితే ప్రజాస్వామ్యం ఏం కావాలని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఈ కేసును తెర మీదకు తెచ్చారనే వాదన కూడా బీజేపీ చేసిందని, మునుగోడు ఎన్నికల ఫలితం వెలువడిపోయిందని, కేసు దర్యాప్తును అడ్డుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.