హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి వేసిన పిటిషన్పై శనివారం తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును 31న వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది. అప్పటివరకు అవినాశ్పై కఠిన చర్యలు చేపట్టవద్దని సీబీఐని ఆదేశిస్తూ జస్టిస్ ఎం లక్ష్మణ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు సామాన్యుల కేసుల్లో కూడా ఇం త జాప్యం ఉంటుందా? వివేకా హత్యకు ప్ర ధాన కారణం ఏమిటి? అని హైకోర్టు ప్రశ్నించింది.
తమ విచారణకు అవినాశ్ ఏమాత్రం సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని సీబీఐ లా యర్ తెలిపారు. రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగినట్టు చెప్పారు. అవినాశ్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారా? అని హైకోర్టు ప్రశ్నించగా, లేదని, వాట్సాప్ ద్వా రా ఆయన ఎవరికి కాల్స్ చేశారో గుర్తించలేమని సీబీఐ జవాబిచ్చింది.
అవినాశ్ తరఫు లాయర్ మాట్లాడుతూ అవినాశ్ను కేసులో ఇరికించాలని సీబీఐ కుట్ర పన్నిందని ఆరోపించారు. మరోవైపు వివేకా కుమార్తె సునీత తరఫు లాయర్ కూడా వాదన వినిపించారు. వివేకా హత్య గురించి ఆయన పీఏ కృష్ణారెడ్డి కంటే ముందే సీఎం జగన్కు తెలిసిందని సీబీఐ చెబుతున్నందున ఆ కోణంలో దర్యాప్తు చేయాలని, అవినాశ్కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.