హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గండిపేట మండలం మంచిరేవులలో రూ.10 వేల కోట్ల విలువైన భూమిని కాపాడుకొనేందుకు జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. గతంలో పేదలకు కేటాయించిన ఆ భూమిని 2007లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం 43 పేజీల కీలక తీర్పును వెలువరించింది. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చెల్లదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ టీ తుకారాంజీతో కూడి న ధర్మాసనం రద్దు చేసింది. సర్వే నంబర్ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరైనదేనని ప్రకటించింది. 1961లో పేదలకు ఆ భూముల్లో పట్టాలు ఇచ్చిన తాసిల్దార్.. కలెక్టర్ అనుమతి లేకుండా ఆ భూములను ఇతరులకు ఇవ్వరాదని, అన్యాక్రాంతం చేయరాదని అసైనీలకు నిబంధన విధించారని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ తర్వాత అసైనీలు అల్లా భరూ అనే వ్యక్తికి జీపీఏ ఇవ్వడం.. అనంతరం జీపీఏ ఆ భూములను 71 మందికి విక్రయించడం నిబంధనను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నది. ఈ కీలక అం శాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 2006లో అసైనీలకు, వారి పాట్లను కొనుగోలు చేసిన 71 మందికి నోటీసులు ఇచ్చి వారి వాదనలను కూడా విన్న తర్వా తే ఆ భూములను స్వాధీనం చేసుకొన్నదని తెలిపింది. భూములను సాగుచేసుకొనేందుకు మాత్రమే అసైనీలను అనుమతించాలని ధర్మాసనం గుర్తుచేసింది.