హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన భవానాన్ని కూల్చి తిరిగి కొత్తగా నిర్మిస్తారా లేక వారసత్వ భవనాన్ని కాపాడుతూ ఖాళీస్థలంలో కొత్త భవనాలను నిర్మిస్తారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దవాఖాన బ్లూప్రింట్ను ఆరు వారాల్లోగా సమర్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఉస్మానియా భవనం చారిత్రక వారసత్వ సంపద కనుక కూల్చవద్దని, శిథిలావస్థకు చేరినందున కూల్చేసి కొత్తగా నిర్మించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రస్తుత భవనాన్ని కూల్చి నిర్మాణం చేయాలా? లేక పాత భవనానికే మరమ్మతులు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయానికి రాలేదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. వారసత్వ భవనాన్ని వదిలి ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు నిర్మించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకూ వేచి ఉండాలని చెప్పింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.