హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు సబబేనని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఈ నెల 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకునే అంశాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెలువరించిన నోటిఫికేషన్లోని నిబంధనలకు అటు కమిషన్ ఇటు అభ్యర్థులు కూడా కట్టుబడి ఉండాలని పేర్కొంది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోకపోవడం వల్ల అక్రమ మార్గంలో అభ్యర్థులు చొరబడేందుకు ఆసారం ఉందని అభిప్రాయపడింది. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే అవకాశాలు ఉంటాయని, ఈ విషయంలో కమిషన్ అనుమానాలకు ఆసారం కల్పించిందని వ్యాఖ్యానించిది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అనిల్కుమార్ జూలకంటి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
గ్రూప్-1 పరీక్ష సందర్భంగా.. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, నామినల్ రోల్స్లో ఇద్దరు ఇన్విజిలేటర్ల సంతకాలు తీసుకోలేదని పేరొంటూ ముగ్గురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 23న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గంటపాటు వాదప్రతివాదనలు జరిగిన అనంతరం అప్పీల్ను కొట్టేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే యోచనలో సర్వీస్ కమిషన్ ఉన్నట్టు తెలిసింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టేయాలన్న తమ వాదనను డివిజన్ బెంచ్ ఆమోదించకపోవడంపై న్యాయపరమైన అంశాలను సమీక్ష చేయనుంది. తీర్పు కాపీ అధికారికంగా అందిన తర్వాత అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేసి, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.