హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఇది సున్నిత విషయం. దేశమంతా ఈ కేసు గురించి చూస్తున్నది. జాతీయ స్థాయి అంశమైంది. ఇలాంటి కేసుల్లో పిటిషనరే (బీజేపీ) విచారణ కోరడం సరికాదు. ఒక పార్టీకి చెందిన పిటిషనర్కు రిట్ దాఖలు చేసే అర్హత లేదు’ అని పేర్కొన్నది. పిటిషన్కు విచారణార్హత లేదని ప్రభుత్వం చెప్పిన అంశాలను కూడా పరిశీలిస్తామని, అన్ని కోణాల్లో పరిశీలించి, ఆధారాలు ఉన్నాయంటేనే ముందుకు వెళతామని తెలిపింది.
ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటు చేసే సిట్కు అప్పగించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన రిట్పై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి విచారణ జరిపారు. ఇదిలా ఉండగా, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఎమ్మెల్యేల ఎర కేసు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీశ్, కోరె నందకుమార్ (నందు), డీపీఎస్కేవీఎన్ సింహయాజి శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు చెందిన ఆడియోలు, వీడియోలు విడుదల కాకుండా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని, ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని కోరుతూ నిందితుడు నందకుమార్ (నందు) భార్య చిత్రలేఖ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తీన్మార్ మల్లన్న ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిన్నింటినీ 7వ తేదీన విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ‘గతంలో రెండు కేసులు ఉండేవి. ఒక కేసులో ఉత్తర్వుల తర్వాత నిందితులు రిమాండ్కు వెళ్లారు. ఒకే కేసులో ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు. అయితే ఒక కేసులో ఉత్తర్వుల ప్రకారం నిందితులు రిమాండ్కు వెళ్లినందున ఒక కేసే ఉన్నట్టు. ఒక పార్టీవాళ్లు తమను లక్ష్యంగా చేసుకుని మరో పార్టీ చేస్తున్నదని చెబుతున్నారు. ఇది చాలా సున్నితమైన విషయం. వివాదాస్పదమైన అంశం కూడా. పిటిషనర్ కోరిన విధంగా విచారణను 7వ తేదీకి వాయిదా వేస్తున్నాం’ అని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
తొలుత పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచందర్రావు వాదనలు వినిపిస్తూ, ఎమ్మెల్యేలను మెయినాబాద్ ఫాంహౌస్లో ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించడంపై పోలీసుల దర్యాప్తును వాయిదా వేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే కోట్ల రూపాయల నగదు ఇస్తామని నిందితులు ఆశపెట్టారని చెప్పారు. కేసు దర్యాప్తును వాయిదా వేయాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అడ్డంకిగా ఉన్నాయన్నారు. ఈ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి తిరసరించారు. ఈ నెల 7న జరిగే విచారణలో పోలీసుల అభ్యర్థనపై తగిన నిర్ణయాన్ని వెలువరిస్తామని స్పష్టం చేశారు. అదనపు ఏజీ రామచందర్రావు వాదిస్తూ, బీజేపీకి పిటిషన్ దాఖలు చేసే అర్హతే లేదన్నారు.
నిందితులు కానివారు రిట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. 214 పేజీల కౌంటర్ వేశామని చెప్పారు. దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్, సీహెచ్ నరేశ్రెడ్డి కల్పించుకొని చాలా పెద్ద కౌంటర్ కాబట్టి తమ వాదనలు చెప్పేందుకు గడువు కావాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి కల్పించుకొని, ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసని, వాయిదా కోరితే ఎలాగని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతున్న కేసని అన్నారు. ఒక రోజు వాయిదా వేయాలని ప్రభాకర్ కోరడంతో న్యాయమూర్తి అనుమతించారు.
దర్యాప్తుపై 24 గంటల్లోనే అనుమానాలా?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు నమోదై ఒకరోజు కూడా కాకముందే.. అంటే 24 గంటల్లోపే రాష్ట్ర పోలీసుల దర్యాప్తు పక్షపాతంగా జరుగుతున్నదని బీజేపీ రిట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని నిందితులు ఎర వేశారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతున్నదని ప్రభుత్వం తరఫున రాజేంద్రనగర్ ఏసీపీ బీ గంధాధర్ 214 పేజీలతో సమగ్ర కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటు చేసే సిట్కు అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన కేసులో ఈ కౌంటర్ వేశారు.
అందులో తెలిపిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.. ‘ఎమ్మెల్యేల ఎర పేరుతో ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర చేశారు. దర్యాప్తు ఏకపక్షంగా జరుగుతున్నదని పిటిషనర్లు ఏ ఒక ఆధారాన్నీ చూపడం లేదు. కేసు వివరాల్లో వాస్తవాలను గోప్యంగా ఉంచారు. వాస్తవాలను పిటిషన్లో వెల్లడించలేదు. పోలీసులు అక్టోబర్ 26న కేసు నమోదు చేస్తే ఆ తర్వాత రోజునే దర్యాప్తు ఏకపక్షంగా ఉన్నదని, నిష్పక్షపాతంగా జరగడం లేదని పేర్కొంటూ బీజేపీ రిట్ దాఖలు చేసింది. కానీ అందుకు ఆధారాలు ఏమీ చూపలేదు. 24 గంటలు కూడా గడవకముందే దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉన్నది. బీజేపీ కేసు వేసే సమయానికి ముగ్గురు నిందితులను కనీసం రిమాండ్కు కూడా పంపలేదు. బీజేపీ కీర్తి ప్రతిష్ఠలకు మచ్చ తేవడం కోసం ఎర కేసును పోలీసులు నమోదు చేశారనేందుకు ఆధారాలు లేవు.
మెయినాబాద్ పోలీసులకు ముందుగా సమాచారం వచ్చింది. అన్ని ఆధారాలతోనే వారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారిగానే ఏసీపీ మొయినాబాద్ ఫాంహౌస్కు వెళ్లారు. సంఘటనా స్థలానికి ఏసీబీ వెళ్లడాన్ని తప్పుపట్టడం సరికాదు. అక్టోబర్ 26న పంచనామా పూర్తి అయ్యింది. 27న మధ్యవర్తుల సంతకాలు ఉన్నాయని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. పంచనామా 26న మొదలై 27న ఉదయం 8.30 గంటలకు పూర్తి అయ్యింది. మధ్యవర్తులు సంతకం చేశాక తేదీని వేయడంలో అనుకోని పొరపాటు జరిగింది. దీనివల్ల కేసుకేమీ నష్టం లేదు. ఈ విషయాన్ని పిటిషనర్ కూడా రిట్లో పేరొనలేదు. ఇదేమీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశం కాదు. ఇలాంటి కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు మంచి అనుభవం ఉన్నది. దేశంలోనే మంచి పేరు ఉన్నది. దర్యాప్తు జాప్యం కాకుండా చూడాలి. దర్యాప్తును వాయిదా వేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలి. లేకపోతే నిందితులను పోలీసుల కస్టడీకి తీసుకుని విచారించేందుకు వీల్లేకుండా పోతుంది. ఇలాగే కొనసాగితే, జాప్యమైతే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఆసారాలు ఉంటాయి. తక్షణమే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలి. కేసు దర్యాప్తునకు అవరోధాలను తొలగించాలి.’