హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): ఆరియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శిలాశాసనాలను డిజిటలైజేషన్ చేసే కాంట్రాక్ట్ పనిని నామినేషన్ పద్ధతిపై జియోఫెల్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఐక్యూఎల్)కు అప్పగించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఏఎస్ఐ మైసూర్ యూనిట్ ఇచ్చిన రూ.5.61 కోట్ల కాంట్రాక్టును బుధవారం రద్దు చేసింది. తదుపరి అర్హత ఉన్న పోటీదారుకు ఆ వర్ ఆర్డర్ను ఇవ్వాలని ఆదేశించింది. 74 వేల శిలాశాసనాలను డిజిటలైజేషన్ చేసేందుకు రూ.5.61 కోట్లకు నామినేషన్ విధానంలో జియోఫెల్కు ఇచ్చిన కాంట్రాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్లోని రవిప్రెస్ ఫొటోకు చెందిన ఫొటో జర్నలిస్ట్ డి రవీందర్రెడ్డి రిట్ దాఖలు చేశారు. గతంలో లక్ష శిలాశాసనాల డిజిటలైజేషన్కు రూ.1.5 కోట్లకే ఏఎస్ఐ టెండర్ ఇచ్చిందని, ఇప్పుడు కేవలం 74 వేల శిలాశాసనాలకు రూ.5.61 కోట్లు ఇవ్వడం వల్ల ప్రజాధనం భారీగా వృథా అవుతున్నదని పిటిషనర్ పేర్కొన్నారు.
ఏఎస్ఐ అనుసరించిన విధానం చట్ట వ్యతిరేకంగా ఉన్నదని రవీందర్రెడ్డి తరపు న్యాయవాది పోతిన ప్రేమ్కుమార్ వాదించారు. నిబంధనలకు విరుద్ధంగానే కాకుండా అధిక ధరకు కాంట్రాక్టును కట్టబెట్టారని చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’తో పిటిషనర్ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ప్రభుత్వానికి రూ.3.5 కోట్లు ఆదా అవుతాయని చెప్పారు. తాను కూడా ఆ చారిత్రాత్మక పనిని చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు.