హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): యథాతథ స్థితిని (స్టేటస్కో) కొనసాగించాలన్న ఉత్తర్వులు జారీ అయ్యాయన్న కారణంతో అధికారులు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా ఉండకూదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్లోని అత్తాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామంటూ కొందరికి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులో కింది కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఇవ్వడంతో సదరు వ్యక్తులు ఆ నిర్మాణాలను కొనసాగించారు.
దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటే అక్రమ నిర్మాణాల కొనసాగింపునకు అనుమతి ఇవ్వడం కాదని, అక్రమ నిర్మాణాలను చూస్తూ ఊరుకోవడం సముచితం కాదని పేర్కొన్నది. నిర్మాణాలను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించి, విచారణను ముగించింది.