హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పును దృష్టిలో ఉంచుకుని, ప్రజా జీవితంలో అంకితభావంతో కూడిన పోరాటాలు, త్యాగాలు, గణనీయమైన సేవలను గుర్తించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్కు విజ్ఞప్తి చేశారు.
తమ నేపథ్యాలు, జీవితకాల కృషి, సామాజికసేవ, కళ, సాహిత్యరంగాలకు అందించిన సేవలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) లో పేరొన్న అర్హత ప్రమాణాలకు సరిగ్గా సరిపోతాయని తెలిపారు. తాము సమాజంలోని అత్యంత వెనుకబడినవర్గాల నుంచి వచ్చామని, తమలాంటి నేపథ్యాలున్నవారికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు చాలా అరుదని పేరొన్నారు. హైకోర్టు తీర్పుతోపాటు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉన్న తమ అర్హతలను దృష్టిలో ఉంచుకుని, 2023 జూలైలో మంత్రిమండలి చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. చట్టసభలకు గౌరవం తెచ్చేవిధంగా తమ వంతు పాత్ర పోషిస్తామని, సమాజానికి, పేద వర్గాలకు, దేశానికి మరింత ఉత్సాహంతో సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.