హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట ఎందుకు హాజరు కాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ (బీఎల్ సంతోష్)ను హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన తరువాత కూడా విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బందులు ఏమున్నాయని నిలదీసింది. ‘సీఆర్పీసీలోని 41 ఏ సెక్షన్ కింద సిట్ నోటీసు జారీ చేసిన తర్వాత దర్యాప్తునకు హాజరై తెలిసిన వివరాలు వెల్లడించేందుకు ఇబ్బంది ఏమిటి?’ అని అడిగింది. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని సిట్కు చెప్పి, రెండు మూడు రోజులు గడువు కోరవచ్చు కదా? అని వ్యాఖ్యానించింది. సిట్ అరెస్టు చేస్తుందని భయాందోళనలు వ్యక్తంచేసిన నేపథ్యంలో అరెస్టు చేయరాదని ముందే మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన విషయాన్ని గుర్తుచేసింది.
బీఎల్ సంతోష్కు 41 ఏ నోటీసు జారీ చేయడాన్ని సవాలుచేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి దాఖలుచేసిన రిట్ పిటిషన్ను, దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని సిట్ దాఖలు చేసిన మరో పిటిషన్ను కలిసి న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్రెడ్డి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గురించి ఆరా తీయగా, ఇంకా అందుబాటులోకి రాలేదని సిట్ తరఫు అడ్వకేట్ జనరల్ బీఎల్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల ప్రతి అందిన తరువాత కేసుల విచారణలో ముందుకు వెళ్తామని తెలిపారు. సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షణలో జరగాలన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని చెప్పారు. హైకోర్టులోని కేసులను సత్వరమే విచారణ చేయాలని కూడా ఆదేశించిందని వెల్లడించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి అందాక, దానిని పరిశీలించాకే బుధవారం ఈ కేసులలో విచారణ కొనసాగిస్తామన్నారు. ఈలోగా తుది విచారణ చేయలేమని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతులను అందజేయాలని ఏజీని ఆదేశించారు. న్యాయవాదులు కూడా పిటిషనర్ల కచ్చితమైన వైఖరి ఏమిటో తెలుసుకుని చెప్పాలని ఆదేశించారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
సిట్కు సహకరించడం లేదు: ఏజీ
ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ, సిట్ దర్యాప్తునకు సహకరిస్తామని ఇదే హైకోర్టుకు చెప్పారని, ఇప్పుడు నోటీసులు అందుకొన్న తర్వాత కూడా బీఎల్ సంతోష్, ఇతరులు సిట్ దర్యాప్తునకు హాజరుకాలేదని చెప్పారు. సిట్ ఇచ్చిన 41ఏ నోటీసులు వారికి అందాయని తెలిపారు. సిట్ దర్యాప్తునకు హైకోర్టే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం అనుమతిచ్చిందని పేర్కొన్నారు. సాక్షులు, అనుమానితులకు 41 ఏ నోటీసులు జారీ చేశాక సిట్ దర్యాప్తునకు సహకరించకుంటే చట్టప్రకారం ముందుకు వెళ్లేందుకు సింగిల్ జడ్జి ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. నిందితుల వాంగ్మూలాలు, దర్యాప్తులో లభ్యమైన సాక్ష్యాధారాల తర్వాతే బీఎల్ సంతోష్, ఇతరులకు సిట్ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఈ నెల 20న బీఎల్ సంతోష్కు సీఆర్పీసీలోని సెక్షన్ 41 ఏ కింద నోటీసు జారీ అయ్యిందని వివరించారు. అయినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతున్నా.. విచారణకు రాకపోవడం సహకరించకపోవడమేనన్నారు. బీఎల్ సంతోష్ సిట్ విచారణకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.
బీజేపీ ఆఫీసులో నోటీసులు ఇచ్చాం
ఢిల్లీ పోలీసుల తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జీ ప్రవీణ్ కుమార్ వాదిస్తూ, తెలంగాణ సిట్ జారీచేసిన నోటీసును ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలోని హేమేందర్ అనే వ్యక్తికి అందజేశారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో బీఎల్ సంతోష్ లేరని, గుజరాత్లో ఉన్నారని పేర్కొన్నారు. సిట్ నోటీసుల జారీకి సంబంధించి ఢిల్లీ పోలీసులు అందజేసిన వివరాలను కోర్టుకు నివేదించారు. బీజేపీ పిటిషనర్ తరఫు న్యాయవాది కల్పించుకొని, బీఎల్ సంతోష్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని చెప్పారు. అందుకే సిట్ దర్యాప్తునకు హాజరు కాలేకపోయారని వివరించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. ఇదే విషయాన్ని సిట్కు చెప్పి, రెండు రోజులు గడువు కోరితే సరిపోయేది కదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతుల పరిశీలన తర్వాత విచారణ కొనసాగిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్
నాంపల్లి క్రిమినల్ కోర్టు, నమస్తే తెలంగాణ 22: టీఆర్ఎస్ ఎమ్యెల్యేలకు ఎర కేసులో అరెస్ట్ అయిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలి
నిందితుల తరఫున అనుబంధ పిటిషన్ దాఖలు
సిట్ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఎమ్మెల్యేల ఎర కేసు నిందితులు రామచంద్రభారతి, కోరె నందకుమార్, సింహయాజి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు జైల్లో ఉన్నందున సంతకాలు చేయలేకపోయారని, సిట్ను రద్దు చేసి, కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ వారి తరఫున న్యాయవాది వీ కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు.