హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సినిమా పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సినీ దర్శకుడు ఎన్ శంకర్కు ఐదు ఎకరాల భూమిని కేటాయించడాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లాలోని సర్వే నంబర్ 8లోని ఐదు ఎకరాలను ఎకరం రూ.5 లక్షల చొప్పున ఎన్ శంకర్కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్కు చెందిన జే శంకర్ 2020లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టేసింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం సంస్థలకు, ప్రముఖులకు, క్రీడాకారులకు, కళాకారులకు భూమిని కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని స్పష్టంచేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఉన్నాయని పేర్కొన్నది. ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాష్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, కేరళ ఆయుర్వేదిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు ఈ ఏడాది తాజాగా వెలువరించిన తీర్పుప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపును తప్పుపట్టేందుకు ఆసారం లేదని తెలిపింది. శంకర్కు స్టూడియో నిర్మాణం కోసం భూమిని తకువ ధరకే కేటాయించారని పేర్కొన్న పిటిషనర్.. పద్మాలయ, అన్నపూర్ణ స్టూడియోలకు భూ కేటాయింపులను ప్రజాహిత వ్యాజ్యంలో ప్రశ్నించలేదని వ్యాఖ్యానించింది.
‘రాష్ట్ర ప్రభుత్వం బహుళ ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భూకేటాయింపులు చేస్తుంది. ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్కు ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వలేదు. 2019 జూన్ 21న జారీచేసిన జీవో 75 ప్రకారం ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున రూ.25 లక్షలు శంకర్ చెల్లించారు. టీవీ, సినిమా స్టూడియో నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం కనీస ధరకు ఇచ్చింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు, అభియోగాలు ఏమీ లేవు. శంకర్ ప్రముఖ దర్శకుడు కాదని పిటిషనర్ కూడా చెప్పడంలేదు. భూమి కేటాయింపును మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్టూడియో నిర్మాణానికి భూమి కేటాయించింది’ అని సమర్థించింది. సినిమా పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు దోహదపడేలా భూ కేటాయింపు జరిగిందని’ విచారణ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చేసిన వాదనను హైకోర్టు ఆమోదించింది.