హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): గోలొండ సమీపంలో హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు అసోసియేషన్కు భూమి కేటాయింపు, గోల్ఫ్ కోర్సు ఏర్పాటు ఇతర విషయాలపై నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. గోలొండకు సమీపంలోని జమాలికుంట, నాయా ఖిల్లా ప్రాంతాల్లోని భూమిని గోల్ఫ్ కోర్సుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేటాయించింది.
చారిత్రాత్మక గోలొండ కోట ప్రత్యేకత దెబ్బతింటుందంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిక్ యాక్షన్ అండ్ రైట్స్ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అనే సంస్థ 2008లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
గోల్ఫ్ కోర్సు నిర్మాణాల పేరుతో ఎలాంటి పేలుళ్లకు పాల్పడొద్దని, పనులు నిర్వహించొద్దని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గోల్ఫ్ మైదానంలో పచ్చిక ఏర్పాటుకు అనుమతించింది. ఉత్తర్వులను ఉల్లంఘించి పనులు నిర్వహిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. దీనిపై హైకోర్టు కేంద్ర, రాష్ర్టాల పురావస్తు శాఖలను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.