హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు హాజరుకావాలని బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులివ్వాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదేశించింది. నోటీసులిచ్చినా సిట్ దర్యాప్తునకు హాజరుకాని బీఎల్ సంతోష్ను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని సిట్, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరాయి. ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ ఈ నెల 9న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తిచేశాయి. ఆ ఉత్తర్వులతో దర్యాప్తులో పురోగతి సాధించలేకపోతున్నామని సిట్ తెలిపింది. బీఎల్ సంతోష్ సిట్ దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, 41ఏ నోటీసులో పేరొన్న నిబంధనలకు తిలోదకాలిచ్చారని పేరొంది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి.. బీఎల్ సంతోష్ తరఫున వాదించే న్యాయవాది ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఎవరూ లేకపోవడంతో బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులు జారీచేయాలని సిట్ను ఆదేశించారు. సంతోష్ ఈ-మెయిల్, వ్యక్తిగత సెల్ఫోన్ నంబర్లో ఉండే వాట్సాప్ ద్వారా నోటీసులు పంపాలన్నారు. సిట్ తీసుకున్న చర్యలపై ఈ నెల 29లోగా నివేదిక అందజేయాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా హైకోర్టు.. బీఎల్ సంతోష్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది.
‘సిట్ దర్యాప్తునకు బీఎల్ సంతోష్ ఎప్పుడు వస్తారో ఎవరు చెప్పగలరు? ఆయన తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?’ అని ప్రశ్నించింది. సిట్ దర్యాప్తునకు హాజరవుతామని చెప్పి ఇలా చేయడం సబబు కాదని వ్యాఖ్యానించింది. సిట్ దర్యాప్తునకు బీఎల్ సంతోష్ హాజరవుతారా? లేదా? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉంటే అదే చెప్పొచ్చు కదా? సిట్ పేర్కొన్న తేదీకి రాలేక పోతే.. ఫలానా తేదీన వస్తామని చెప్పడానికి ఇబ్బందేమిటి?’ అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి, సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ నిందితులు రామచంద్రభారతి, కోరె నందకుమార్, సింహయాజి తాజాగా దాఖలు చేసిన కేసును, సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ కరీంనగర్ న్యాయవాది బీ శ్రీనివాస్ వేసిన మరో కేసు అన్నీ కలిపి బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.
బీఎల్ సంతోష్ సహాయ నిరాకరణ: ఏజీ
సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, బీఎల్ సంతోష్ సిట్ విచారణకు హాజరుకాకుండా దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పారు. అందువల్ల.. ఆయన్ను అరెస్టు చేయవద్దన్న ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. స్వేచ్ఛగా దర్యాప్తు కొనసాగించేందుకు సిట్కు వీలు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు కూడా సిట్ స్వేచ్ఛగా దర్యాప్తు చేయాలని ఆదేశించిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతిని హైకోర్టుకు అందజేశారు. బీఎల్ సంతోష్కు వ్యక్తిగతంగా నోటీసులు అందలేదని ప్రేమేందర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సీహెచ్ వైద్యనాథన్ చెప్పారు. సంతోష్ను అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతాయని అన్నారు. ఈ వాదనలను బీఎస్ ప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. సిట్కు బీఎల్ సంతోష్ అయినా, ఇంకెవరైనా ఒకటేనని స్పష్టంచేశారు. చట్టం ముందు అందరూ సమానమనే విషయాన్ని విస్మరించి వాదిస్తే ఎలా? అని ప్రశ్నించారు.
సాక్ష్యాధారాలు తారుమారు చేశాక వస్తారేమో: ఏఏజీ
అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు వాదనలు వినిపిస్తూ.. ముందు నిర్ణయించిన కార్యక్రమాల వల్ల సిట్ ఎదుట హాజరుకాలేకపోతున్నట్లు బీఎల్ సంతోష్ లేఖ రాశారని చెప్పారు. ఆయనకు నోటీసులు అందజేసేందుకు సిట్ ఈ నెల 16 నుంచి ప్రయత్నిస్తున్నదని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. ఆయన సిట్ ముందుకు ఎప్పుడు వస్తారో తెలియజేయలేదన్నారు.బీఎల్ సంతోష్ దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయని, ఆయన ఫోన్లో కీలక సమాచారం ఉన్నదని చెప్పారు. సాక్ష్యాధారాలను తారుమారు చేశాక సిట్ ఎదుట హాజరవుతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ వినతి మేరకు సంతోష్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించిందని, ఇప్పుడు ఆయనకు బీజేపీ ప్రాతినిధ్యం వహించడం లేదు కాబట్టి అరెస్టు చేయవద్దన్న ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఢిల్లీ పోలీసులు సిట్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రం తరఫున డిప్యూటీ ఎస్జీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బీఎల్ సంతోష్ ఢిల్లీలో లేరని, హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ నోటీసులను ఢిల్లీ బీజేపీ కార్యాలయంలోని హేమేందర్ అనే వ్యక్తికి అందించారని చెప్పారు.
ఢిల్లీలో జరిగేది ఇకడి బీజేపీకి తెలియదా?
విచారణ సందర్భంగా హైకోర్టు.. ఢిల్లీలో జరిగే బీజేపీ వ్యవహారాల గురించి రాష్ట్ర బీజేపీ వాళ్లకు తెలియదా? అని సందేహం వ్యక్తం చేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పిటిషనర్ ప్రేమేందర్ రెడ్డి) ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరఫున బాధ్యత తీసుకోవాలి కదా? అని ప్రశ్నించింది. ఇంతకీ బీఎల్ సంతోష్ తరఫున ఏ న్యాయవాది ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రశ్నించింది. 41ఏ నోటీసును సవాల్ చేశారు కదా? అని నిలదీసింది. అదే విధంగా సిట్ దర్యాప్తును న్యాయమూర్తి పర్యవేక్షణ చేయగలరని భావిస్తున్నారా? అని బీజేపీని ప్రశ్నించింది.
బీజేపీ వింత వాదన
విచారణ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి (పిటిషనర్) తరఫు న్యాయవాది వింత వాదనలు చేశారు. ఏదైనా ఆరోపణలు వస్తే ఎంతటివారైనా కోర్టుకు లేదా సంబంధిత దర్యాప్తు సంస్థ ముందుకు రావాల్సిందే. కానీ.. పిటిషనర్ తరఫు న్యాయవాది మాత్రం.. వయసులో పెద్దవారైన బీఎల్ సంతోష్పై ఆరోపణలు సరికాదని చెప్పుకొచ్చారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన ప్రముఖ నేతగా బీఎల్ సంతోష్ను అభివర్ణించిన న్యాయవాది.. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. పైగా.. ఆయనను అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయంటూ బీఎల్ సంతోష్ను ఆకాశానికెత్తే ప్రయత్నం చేశారు.
ఇప్పటివరకు వారిని ప్రశ్నించలేదు
ఏసీబీ కోర్టుకు సిట్ వినతి
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల నుంచి ఇంకా అనేక కీలక విషయాలను రాబట్టాల్సి వున్నదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏసీబీ కోర్టుకు తెలిపింది. అందువల్ల నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిని నిందితుల తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. నిందితులను ఇప్పటికే మొయినాబాద్ పోలీసులకు ఐదు రోజుల కస్టడీకి ఇచ్చారని తెలిపారు. ఈ వాదనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వ్యతిరేకించారు. ఈ కేసును సిట్ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నదని, అనేక కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయని చెప్పారు. ఇంకా అనేక విషయాలను నివృత్తి చేసుకోవాల్సి ఉన్నదని, అందువల్ల నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు.
ఈ కేసు దర్యాప్తును సిట్ చేపట్టిన తరువాత నిందితులను కస్టడీకి ఇవ్వలేదని గుర్తుచేశారు. సిట్ కస్టడీకి ఇస్తేనే దర్యాప్తు మరింత వేగవంతం అవుతుందని చెప్పారు. ఈ కేసు హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు చేరిందని, రెండు చోట్లా నిందితులకు వ్యతిరేకంగానే ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. బీఎల్ సంతోష్ ఇంకా నోటీసు అందుకోలేదని, ఆయన సిట్ ఎదుట హాజరయ్యేందుకు గడువు కోరారు తప్ప ఎప్పుడు వస్తారో చెప్పలేదని అన్నారు. సిట్ దర్యాప్తును నీరుగార్చాలనే కుట్ర జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో నిందితులను సిట్ కస్టడీకి ఇస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు గురువారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది.