Telangana | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఎనిమిది నెలల్లో రూ.18,964 కోట్ల వసూళ్లు రాబట్టిన రాష్ట్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంలో దాదాపు రూ.30,048 కోట్ల వసూళ్లు సాధించినట్టు తాజా నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది. అంటే.. గత ఆరేండ్లలో ఈ వసూళ్లు ఏకంగా రూ.11,084 కోట్లు (63 శాతం) పెరిగినట్టు లెక్క. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగడమే ఇందుకు కారణం. బీఆర్ఎస్ ప్రభుత్వ సంస్కరణలతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని సాధించడంతో రాష్ట్ర ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఎన్నో రంగా ల్లో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించింది.
దీంతో ఆది నుంచే జీఎస్టీ వసూళ్లలో సత్తా చాటుతున్న రాష్ట్రం.. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ వెనుకంజ వేయలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.31,187 కోట్ల జీఎస్టీ వసూలవుతుందని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేయగా.. తొలి ఎనిమిది నెలల్లో రూ.18,218 కోట్లు వసూలయ్యాయి. కానీ, 2020-21లో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా తగ్గడంతో ఆ ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల జీఎస్టీ రాబడి రూ.15,247 కోట్లకే పరిమితమైంది. అయినప్పటికీ ఇది మిగిలిన రాష్ర్టాల కంటే మెరుగైన రాబడే. ఆ తర్వాత నుంచి మరింత జోరు పెంచిన తెలంగాణ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఎనిమిది నెలల్లో రూ.20,859 కోట్లు, 2022-23లో నవంబర్ వరకు రూ.27,287 కోట్ల జీఎస్టీ వసూలు చేసింది.
8 నెలల్లో రూ.30,047.59 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రాష్ట్రం ఆరంభం నుంచే జీఎస్టీ వసూళ్లలో జోరు ప్రదర్శించడంతో ఏప్రిల్లో రూ.4,082 కోట్ల రాబడి వచ్చింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో వసూలైన జీఎస్టీ కంటే రూ.694 కోట్లు ఎక్కువ. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో నవంబర్ వరకు సగటున నెలకు రూ.3,500 కోట్ల చొప్పున మొత్తం రూ.30,047.59 కోట్ల రాబడి వచ్చింది. ఇది రాష్ట్ర బడ్జెట్ అంచనాలో 59 శాతానికి సమానం.
ఎల్ఈడీ వీధి దీపాల్లో తెలంగాణ టాప్ -2
ఎల్ఈడీ వీధి దీపాలను అ మర్చడంతో తెలంగాణ జాతీయస్థాయి లో టాప్ -2లో ఉన్నట్టు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ ప్రకటించింది. దేశంలోనే అత్యధికంగా 29.47 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చి ఏపీ టాప్లో నిలవగా, తెలంగాణ 16.82 లక్షలు అమర్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈఈఎస్ఎల్ 9వ వార్షికోత్సవంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉజాలా పథకం కింద 36.86 కోట్ల ఎల్ఈడీ బల్బులు, 72.18 లక్షల ట్యూబ్లైట్లు, 23.59 లక్షల ఫ్యా న్లను పంపిణీ చేసినట్టు చెప్పింది.