Group-4 Exam | హైదరాబాద్/ఖమ్మం/మాదన్నపేట, జూలై 1 (నమస్తే తెలంగాణ): సింగూరు సింహ గర్జన ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు, పుష్పం ఏవి? బలగం సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు ఎవరు?.. ఇవీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్నలు. పేపర్1 జనరల్ స్టడీస్లో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశ్నలు అడిగారు. తెలంగాణలో అతిపెద్ద పోటీ పరీక్ష గ్రూప్-4 శనివారం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 2,878 కేంద్రాల్లో సాఫీగా ముగిసింది. వివిధ క్యాటగిరీల్లోని 8,039 ఉద్యోగాలకు 9,51,205 మంది దరఖాస్తు చేశారు. 9,12,380 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 80.02శాతం హాజరు నమోదయింది. ఓ రెండు చోట్ల మినహా రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష సజావుగా జరిగింది. 2,878 మంది పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, లైజనింగ్ ఆఫీసర్లు విధుల్లో పాల్గొన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కమిషన్ చైర్మన్ బీ జనార్దన్రెడ్డితోపాటు సభ్యులు పర్యవేక్షించారు.
గ్రూప్ 4 పరీక్ష అభ్యర్థుల విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదో కొన్ని అంశాలు నేర్చుకొంటే సరిపోకుండా.. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి కూలంకషంగా అన్ని విషయాలు నేర్చుకుంటే తప్ప సమాధానం గుర్తించలేని విధంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు. కొన్ని ప్రశ్నల సరళి గ్రూప్-4ను మించి సివిల్స్ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎకువగా ఇవ్వడంతో సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థులు తికమకపడ్డారని అభిప్రాయపడ్డారు. జనరల్ స్టడీస్లో పేరొన్న అన్ని అంశాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడిగారని, కరెంట్ అఫైర్స్తోపాటు ఎకానమీలో కొన్ని అంశాల నుంచి గత రెండు మూడు నెలల్లో జరిగిన అంశాలను కూడా అడిగారని తెలిపారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే, బడ్జెట్తోపాటు ఇతర సంస్థల వార్షిక నివేదికలపై ఎకానమీ విభాగంలో చాలా ప్రశ్నలు వచ్చాయని పేర్కొన్నారు.
తెలంగాణ అంశాలకు జనరల్ స్టడీస్లో పెద్దపీట వేశారని, తెలంగాణ నుంచి చారిత్రక, సామాజిక అంశాలతోపాటు ఇటీవలి కాలంలో అందరినీ కదిలించిన ‘బలగం’ సినిమా నుంచి కూడా ప్రశ్న అడిగారని తెలిపారు. పర్యావరణం, విపత్తు నిర్వహణ, సుస్థిరాభివృద్ధి, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ లాంటి రెగ్యులర్ ప్రశ్నలు వచ్చాయని వివరించారు. మొత్తం మీద గ్రూప్-4 జనరల్ స్టడీస్ పేపర్ను పరిశీలిస్తే.. అభ్యర్థిని బహుముఖ కోణాల నుంచి పరీక్షించినట్టు అర్థమవుతున్నదని అభిప్రాయపడ్డారు. సిలబస్లోని అన్ని అంశాలపై పూర్తి పట్టు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఎకువ మారులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇక సెక్రటేరియేట్ ఎబిలిటీస్ పేపర్ కాస్త కఠినంగానే ఉన్నదని తెలిపారు. రీజనింగ్ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయని, అర్థమెటిక్, ఫ్యూర్ మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఎకువ సమయం తీసుకొన్నట్టు నిపుణులు తెలిపారు. చాలా మంది అభ్యర్థులు పేపర్-2లో సమయం సరిపోక చివరి నిమిషంలో ఇబ్బంది పడ్డారని అభిప్రాయపడ్డారు.
గ్రూప్-4 పరీక్ష రాస్తూ సెల్ఫోన్తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. ఆ అభ్యర్థిపై ఐఎస్ సదన్ పోలీసులు మాస్ కాపీయింగ్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబర్పేట గోల్నాక ప్రాంతానికి చెందిన కే రాజేశ్ (36) శనివారం సరూర్నగర్ మండలంలోని మారుతీనగర్ సక్సెస్ కళాశాల పరీక్షా కేంద్రంలో గ్రూప్-4 మొదటి సెషన్కు హాజరయ్యాడు. పరీక్ష మొదలైన పది నిమిషాల్లో రాజేశ్ సెల్ఫోన్ ద్వారా మాస్ కాపీయింగ్కు పాల్పడుతన్నట్టు ఇన్విజిలేటర్ గమనించి ప్రిన్సిపాల్ సరిత దృష్టికి తీసుకెళ్లారు. అతడి వద్ద సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని, జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశానుసారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రాజేశ్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపారు.
ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని సత్యనారాయణపురం దరిపల్లి అనంతరాములు ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన గ్రూప్-4 పరీక్షలో కొంతమంది అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను బయటకు తెచ్చేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ఆ అభ్యర్థులను వారించి, ఓఎంఆర్ పత్రాలను తీసుకొన్నారు. ఈ ఘటనపై ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతం సీరియస్ అయ్యారు. పరీక్షల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆ నలుగురు అభ్యర్థులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వారిని మధ్యాహ్నం పరీక్ష రాసేందుకు అనుమతించలేదని కలెక్టర్ తెలిపారు. ఆ అభ్యర్థులను మరింతగా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గ్రూప్-4 పరీక్షలో అభ్యర్థి అవగాహనను బహుముఖ కోణాల్లో పరీక్షించేలా ప్రశ్నలు ఇచ్చారు. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎకువగా అడిగారు. దీంతో అభ్యర్థులు సమాధానాలు గుర్తించడంలో ఇబ్బంది పడ్డారు. జనరల్ స్టడీస్లో తెలంగాణ అంశాలకు పెద్దపీట వేశారు. పేపర్-1 పరీక్ష కొంత సులభంగా ఉన్నప్పటికీ, పేపర్-2 మాత్రం కఠినంగానే ఉన్నది. అర్థమెటిక్, ఫ్యూర్ మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు అభ్యర్థులకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటే తప్ప గ్రూప్-4 సాధించడం కష్టమే. గ్రూప్-4 పరీక్షలో పేపర్-1లో ఎక్కువ మందికి 70 నుంచి 80 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. సీరియస్గా ప్రిపేర్ అయిన వారికి మాత్రం 100 నుంచి 110 మార్కులు రావచ్చు. పేపర్-2లో ఎక్కువ మందికి 50 నుంచి 60 మార్కులు మధ్యలోనే వచ్చే అవకాశం ఉన్నది. అతి కొద్ది మందికి మాత్రే 90 నుంచి 100 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది.
– మెండెం కిరణ్కుమార్, ఆర్సీ ఎగ్జామ్