సిద్ధిపేట : బీఆర్ఎస్ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గోదావరి జలాలతో తెలంగాణ ను సస్యశ్యామలం చేశారని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. గజ్వెల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ జలాలను కూడవెళ్లి వాగులోకి, వర్గల్ వద్ద కొండపోచమ్మ సాగర్ జలాలను హల్ది వాగు లోకి ఎంపీ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి గంగమ్మ కు ప్రత్యేక పూజలు చేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాల రాకతో కూడవెల్లి, హల్దివాగు పరివాహ ప్రాంతాల పరిధిలో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వేసిన పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉండటంతో రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామన్నారు.
నాడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే తమకు ఉనికి ఉండదని భావించిన రాజకీయ పార్టీలు వాటిని అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్లి కుట్రలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతే రైతులు , సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారన్నారని వెల్లడించారు. తెలంగాణ మాదిరిగా దేశమంతా అభివృద్ధి, సంక్షేమం కావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు.
బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందన్నారు. అదాని అవినీతిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను ఏకం చేసి పోరాటం సాగిస్తామన్నారు. ఎల్ఐసీని కార్పొరేట్ కోరల్లో నుంచి రక్షించడానికి పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.