వనపర్తి : తెలంగాణలో జల వనరులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భౌగోళిక సానుకూలతలను అనుకూలంగా మలుచుకుని ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేందుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు, కుంటల పునరుద్దరణ, పారుతున్న వాగు, వంకలపై చెక్ డ్యాంలను నిర్మిస్తున్నామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భారతదేశంలోనే ఇది ఒక వినూత్న ప్రయోగం అని తెలిపారు.
వనపర్తి మండలం పరిధిలోని చిట్యాల గ్రామంలో పర్యటించిన సందర్భంగా అక్కడున్న చెక్ డ్యాంను పరిశీలించిన అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఉండే ఎత్తుపల్లాలు సాగునీటిని ఒడిసిపట్టేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. వెయ్యేండ్ల క్రితం కాకతీయ రెడ్డి రాజులు కట్టిన గొలుసుకట్టు చెరువులు తెలంగాణకు ఆదెరువుగా నిలిచాయన్నారు. నదీజలాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు నిర్మించడం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. దీంతో పాటు ప్రతి వాగు, వంకను సజీవంగా ఉంచేందుకు చెక్ డ్యాంల నిర్మాణం జరుగుతుందన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 15 చెక్ డ్యాంలు నిర్మించడం జరిగింది .. ఒక్కో చెక్ డ్యాం ఒక చెరువుకు సమానంగా ఉన్నది. సగటున ఒక చెక్ డ్యాం వెయ్యి నుండి 1500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నదని తెలిపారు.
ఈ వానాకాలంలో ఒక్క వనపర్తి నియోజకవర్గంలో 98 వేల ఎకరాలలో వరి సాగు అయిందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ నుండి నీటి కరువును శాశ్వతంగా దూరం చేసిన మహనీయుడు కేసీఆర్. ఇది అనితర సాధ్యమైన కృషి అని ప్రశంసించారు. తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా తెలంగాణలో ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు, ప్రతి మనిషికి ఉపాధి దొరికే పరిస్థితులు వచ్చాయని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో చెక్ డ్యాంలు, రైతువేదిక, మున్నూరుకాపు, సగర, ఎస్సీ, శాలివాహన, యాదవ, రజక, వాల్మీకి, మత్య్సకార, మహిళా సమాఖ్య భవనాలను, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి, డబల్ బెడ్రూం ఇండ్లు, ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.