హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో ఇండ్ల పన్ను మదింపులో పారదర్శకత, జవాబుదారీ విధానం తేవటానికి మున్సిపల్శాఖ అమలుచేస్తున్న జియో మ్యాపింగ్తో తప్పుడు వివరాలకు చెక్ పడుతున్నది. రాష్ట్రంలో 20,54,216 ఇండ్లు ఉండగా, 17,70,645 ఇండ్ల (86%)కు జియో మ్యాపింగ్ పూర్తయింది. కొత్తగా 26,026 ఇండ్లకు పన్ను విధించగా, 2,49,937 ఇండ్లలో మార్పులను గుర్తించారు. వీటన్నింటికి అదనపు పన్ను విధించగా మున్సిపల్శాఖకు రూ.88 కోట్ల ఆదాయం సమకూరింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో భువన్ ద్వారా ప్రత్యేక మొబైల్ యాప్ను మున్సిపల్శాఖ రూపొందించింది. దీని ద్వారా మున్సిపల్ సిబ్బంది నగరాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటిని ఫొటో తీసి అప్లోడ్ చేసి, ఇంటి కొలతలు నమోదుచేస్తారు.
గత, ప్రస్తుత వివరాలకు తేడాలను గమనిస్తున్నారు. అదనంగా నిర్మించిన గదులకు లెక్కకట్టి పన్ను విధిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆస్తులకు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో అమరచింత, అచ్చంపేట, ఆత్మకూరు, బండ్లగూడ, చౌటుప్పల్, డోర్నకల్, గుండ్లపోచంపల్లి, కొత్తపల్లి, మధిర, మోత్కూరు, నర్సంపేట, పరిగి, రాయికల్, సిద్దిపేట, వికారాబాద్ మున్సిపాలిటీల్లో 100% జియోట్యాగింగ్ పూర్తయింది. 141 మున్సిపాలిటీల్లో 79 మున్సిపాలిటిల్లో 90 శాతానికిపైగా మ్యాపింగ్ పూర్తయింది.