హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టంచేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వంతో చేసిన సంప్రదింపులు సత్ఫలితాన్నిచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు మనోహర్రాజు, బండారు కృష్ణయ్య శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
2016-17 నుంచి 2022-23 మధ్య కాలానికి సంబంధించిన రూ.12,015 కోట్ల విలువైన విద్యుత్తు కొనుగోలు ట్రూఅప్ చార్జీలతోపాటు 2006-07 నుంచి 2020-21 వరకు రూ.4,092 కోట్ల విలువైన విద్యుత్తు పంపిణీ ట్రూఅప్ చార్జీలు కలిపి మొత్తంగా రూ.16,107 కోట్లు విద్యుత్తు వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఈఆర్సీ వద్ద పిటిషన్లు దాఖలు చేశాయని తెలిపారు.
ఈ ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల కింద రూ.203.83 కోట్లు, విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన ట్రూఅప్ చార్జీలు రూ.10,281.73, ఉదయ్ పథకానికి సంబంధించి రూ.2,232.84 కోట్లు మొత్తంగా రూ.12,718.4 కోట్లు వసూలు చేసేందుకు డిస్కంలకు ఈఆర్సీ అనుమతించిందని చెప్పారు. అయితే ఈ భారం వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వంతో ఈఆర్సీ సంప్రదింపులు జరిపిందని తెలిపారు. ఈ మొత్తం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు. ట్రూఅప్ చార్జీల కింద చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ తరహాలో ఐదేండ్లలో డిస్కంలకు చెల్లించనున్నది. దీనిపై బ్యాంక్ వడ్డీని కూడా చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకు ఈఆర్సీ అంగీకరించింది. దీనితో ప్రజలపై ట్రూఅప్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వం ఆదుకున్నట్టయ్యింది.
గణనీయంగా పెరిగిన విద్యుత్తు సబ్సిడీ
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల విద్యుత్తు సహకార సంఘం (సెస్) పరిధిలో మొత్తం 74,954.81 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం అవుతుందని ఈఆర్సీ భావిస్తున్నది. ఇందులో భాగంగా విద్యుత్తు కొనుగోళ్లకు రూ.37,401.64 కోట్లు, విద్యుత్తు పంపిణీకి రూ.9,311.76 కోట్లతోపాటు ఇతర అన్ని రకాల వ్యయాలు కలుపుకొని రూ.52,537.57 కోట్ల వార్షిక ఆదాయం అవసరమని అంచనా వేసింది. ప్రస్తుతం అమలుచేస్తున్న శ్లాబ్ల ప్రకారం చార్జీలు వసూలు చేస్తే.. రూ. 43,221.96 కోట్ల ఆదాయం వస్తుందని, ఇంకా రూ.9,124.82 కోట్ల లోటు ఏర్పడుతుందని ఈఆర్సీ లెక్కగట్టింది.
ఈ నేపథ్యంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా, ఎల్టీ-1 క్యాటగిరీకి కల్పిస్తున్న రాయితీలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం రూ.9,124.82 కోట్లను సబ్సిడీగా అందించనున్నది. దీనితో ఆదాయ లోటు పూర్తిగా భర్తీ అవుతుందని ఈఆర్సీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు సబ్సిడీ కింద రూ.8,221.17 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీ మొత్తం సుమారు 11 శాతం వరకు పెరిగిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించారు. అంటే విద్యుత్తు సబ్సిడీ కింద రూ.9,124.82 కోట్లు, ట్రాఅప్ చార్జీల కింద రూ. 12,718.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నది.
డిస్కంలకు ఈఆర్సీ పలు ఆదేశాలు
ట్రూఅప్ చార్జీలపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మొత్తం 9 పిటిషన్లను ఈఆర్సీ పరిష్కరిస్తూ.. డిస్కంలకు శుక్రవారం పలు ఆదేశాలు జారీచేసింది. దీనితో డిస్కంల రేటింగ్ మెరుగవుతుందని ఈఆర్సీ ఆశాభావం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో అవసరమైన ఓ అండ్ ఎం సిబ్బందిని నియమించుకోవాలని ఈఆర్సీ ఆదేశించింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయంపై డిస్కంలు ఆధారపడకుండా అంతర్గత సామర్థ్యం పెంచుకోవాలని, తద్వారా నష్టాల నుంచి బయటపడాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రైవేటు విద్యుత్తు బిల్లుల బకాయిలను వసూలు చేసేందుకు వన్టైం సెటిల్మెంట్ తరహాలో పథకాలను అమలుచేయాలని కోరింది. దీనివల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉంటాయని పేర్కొన్నది. విద్యుత్తు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్తు కనెక్షన్లు పెట్టడం ద్వారా ప్రమాదాలకు కారణమయ్యే వారిపై నమోదు చేసే క్రిమినల్ సెక్షన్లు కఠినంగా ఉండేలా చూడాలని ఆదేశించింది. బిల్లులు సరిగా వసూలు కాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తద్వారా వసూళ్లను పెంచాలని ఆదేశించింది. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించింది.
ట్రూఅప్ చార్జీలు అంటే..
ఒక ఆర్థిక సంవత్సరంలో అవసరం ఉన్న మేరకు విద్యుత్తు కొనుగోళ్లతోపాటు విద్యుత్తును పంపిణీ చేసేందుకు అయ్యే వ్యయం మొత్తాన్ని అంచనా వేసి ఈఆర్సీ ఆమోదిస్తుంది. నిజానికి ఆ సంవత్సరంలో అయ్యే వాస్తవిక వ్యయం.. అంచనా వ్యయం కంటే ఎక్కువగా, లేదా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటే ట్రూఅప్, తక్కువగా ఉంటే ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది. ట్రూఅప్ అయితే ఆ మొత్తాన్ని ఆ తరువాతి కాలంలో ఈఆర్సీ అనుమతితో వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ట్రూడౌన్ అయితే విద్యుత్తు బిల్లుల్లో తగ్గించాల్సి ఉంటుంది.
ప్రార్థనా స్థలాలకు చార్జీల తగ్గింపు
ప్రార్థనా స్థలాలకు అందించే విద్యుత్తు చార్జీలను యూనిట్కు రూ.5లకు తగ్గించనున్నట్టు ఈఆర్సీ సభ్యులు తెలిపారు. ఎల్టీ-7(బి) క్యాటగిరీలో ఉన్న ప్రార్థనా స్థలాలకు ప్రస్తుతం 2 కిలోవాట్ల లోపు వరకు యూనిట్కు రూ.6.40 పైసలు, అంతకంటే ఎక్కువ లోడ్ ఉంటే రూ.7 చొప్పున వసూలు చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ క్యాటగిరీలో యూనిట్కు రూ.5 చొప్పున మాత్రమే వసూలు చేస్తారని వెల్లడించారు.