హైదరాబాద్/రంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం ఉస్మానియా దవాఖాన నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నారు. మిగిలిన నిలోఫర్, సరోజినీదేవి కంటి దవాఖాన, ప్రసూతి దవాఖాన, గాంధీ దవాఖాన, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజినల్ క్యాన్సర్ సెంటర్, ఈఎన్టీ దవాఖాన, ఫీవర్ హాస్పిటల్, సుల్తాన్బజార్ మెటర్నిటీ హాస్పిటల్, నిమ్స్, టిమ్స్, కింగ్కోఠి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఎంఎన్ ఏరియా, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్, నాంపల్లి ఏరియా దవాఖానల్లో ఏర్పాటు చేసిన క్యాంటీన్లను కూడా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో గురువారమే ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జీహెచ్ఎంసీలోని 18 దవాఖానలకు పెద్ద సంఖ్యలో రోగులు, వారి సహాయకులు వస్తున్నారు. దీర్ఘకాలిక రోగులు రోజుల తరబడి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో వారికి ప్రభుత్వమే పోషకాహారాన్ని అందిస్తున్నది. వారితోపాటు వారి వెంట వచ్చే సహాయకులకు సైతం సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి షెల్టర్లు ఏర్పాటు చేయడంతోపాటు, మూడు పూటలా నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్దేశించారు. దీంతో రూ.5కే భోజనం అందించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.38.66 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నది. దవాఖానల్లో రోగుల సహాయకులు భోజనం చేసేందుకు అవసరమైన నీటి సదుపాయం, షెల్టర్లు, ఫ్యాన్లు లాంటి వాటిని టీఎస్ఎండీసీ ఇప్పటికే ఏర్పాటు చేసింది.
తెలంగాణలో బీజేపీకి చోటు లేదు..: హరీశ్
తెలంగాణలో బీజేపీకి చోటు లేదని మంత్రి హారీశ్రావు స్పష్టం చేశారు. బుధవారం కేశంపేటలో 30 పడకల దవాఖానకు, షాద్నగర్లో 100 పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టానికి బీజేపీ, కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణకు మేలు చేసే పార్టీ కావాలో, హాని చేసే పార్టీలు కావాలో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ స్వరూపం మారిందని కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ ప్రశంసించారని, అయినా ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకూ నీరు రాలేదని బీజేపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు నడ్డా, బండి సంజయ్ అనడం హాస్యాస్పదమని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో రైతు డిక్లరేషన్ అమలవుతున్నదా? అని ఆ పార్టీ నాయకులను నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పుడూ కుర్చీల యావే తప్ప ప్రజలకు ఏమి కావాలో తెలియదని మంత్రి హరీశ్ నిప్పులు చెరిగారు. అంతకు ముందు ఆయన నగరంలోని నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్లో నూతనంగా ఏర్పాటుచేసిన రేడియాలజీ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలో త్వరలోనే 13 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవలను మరింత విస్తరిస్తున్నామని, ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానలు ప్రారంభించామని తెలిపారు.