మంత్రి పువ్వాడ అజయ్కుమార్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): గిరిజనుల పోడుహక్కు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పోడుపట్టాల జారీ ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 140పై మంగళవారం మంత్రి హైదరాబాద్ నుంచి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏండ్లుగా పోడు పట్టాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ పోడుపట్టాలు ఇస్తానని ప్రకటన చేయడంతో గిరిజనులు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. అర్హులకు పట్టాలు జారీ చేస్తూనే అడవిని కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులపై సమగ్ర విచారణ జరిపి, ఎఫ్ఆర్సీ కమిటీలను నియమించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పట్టాలు ఇచ్చిన తర్వాత ఎలాంటి ఆక్రమణలు జరగొద్దని చెప్పారు. పోడు సమస్య పరిష్కారానికి గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర జిల్లాల పరిధిలో ఉన్న పోడు సమస్యల పరిష్కారం కోసం జిలా ్లస్థాయి కమిటీ ఆ జిల్లా స్థాయి కమిటీకి సిఫారసు చేయాలన్నారు. కమిటీ సభ్యుల సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో 10.13 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని, వాటిలో 2.29 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు. గతంలో 85 వేల ఎకరాల భూమికి హక్కు పత్రాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.