హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలోఉద్యోగులకు ఫస్ట్ తారీఖునాడే జీతాలు ఇస్తామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ నాడు దేవుడెరుగు కనీసం 23వ తేదీ నాటికి కూడా వేతనాలు అందక ఉద్యోగులు అల్లాడుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలోని గ్రామీణ ఉపాధి హామీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు, ఉద్యోగులు, వీవోఏలకు ఇంకా వేతనాలు అందలేదు. ఈ రెండు సంస్థల్లో 34 వేల మంది ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్కు సంబంధించి జనవరి 1న వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి వారంలోనే వేతనాలు అందించామంటూ ప్రకటించుకొన్న ప్రభుత్వం ఆయా శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది అధికారులు, ఉద్యోగులకు వేతనాలు వెయ్యలేదు.
సంక్రాంతి పండుగకైనా వేతనాలు వస్తాయేమోనని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. సంక్రాంతి అయిపోయినా కూడా ఇంత వరకు జీతం జమకాలేదు. గ్రామీణ ఉపాధి హామీలో 12 వేల మంది, సెర్ప్లో 17 వేల మంది వీవోఏలు, సెర్ప్లో దాదాపుగా 5 వేల మందికి నేటికి వేతనాలు అందలేదు. ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు సైతం ఇదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబ అవసరాల కోసం తీసుకున్న రుణాలకు ఈఎంఐలు చెల్లించాల్సి ఉన్నదని, వేతనాలు ఆలస్యం కావడంతో సిబిల్ స్కోర్పై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో.. అదిగో.. వేతనాలు వస్తున్నాయంటూ కబుర్లు చెప్తున్నారే తప్ప అందించడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 45 రోజులైనా తమ బాధలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.