హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి కొత్తగా పది లక్షల పింఛన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పింఛన్లు ఇస్తున్నారు. కొత్త వాటితో మొత్తం పింఛన్ల సంఖ్య 46 లక్షలకు చేరింది. లబ్ధిదారులందరికీ ప్రత్యేకంగా కార్డులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది. గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది.
రాష్ట్ర వ్యాప్తంగా 5,111 అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీచేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎస్ఎస్ (సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్), వివిధ పథకాల కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులు 12.9% తగ్గినా, రాష్ట్రం ఈ ఏడాది 15.3% వృద్ధిరేటు నమోదు చేసిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, కేంద్రం పెడుతున్న ఇబ్బందులపై క్యాబినెట్ ప్రత్యేకంగా చర్చించింది. ఐటీరంగానికి సంబంధించి ఉద్యోగ కల్పనలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం తదితర అంశాలపైన చర్చించి అనేక నిర్ణయాలు తీసుకొన్నది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్లో సమగ్రమైన చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధిరేటు నమోదైనట్టు అధికారులు మంత్రివర్గానికి వివరించారు. సీఎస్ఎస్ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులు 12.9 శాతం తగ్గాయని.. అయినా ఈ వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హమని సీఎం కేసీఆర్ చెప్పారు. ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో ఎస్ఎన్ఏ అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతున్నదని అధికారులు తెలిపారు. ఎఫ్ఆర్బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడంతోపాటు పరిమితుల్లో కోతలు విధించారని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిలో కోత విధించకుండా ఉంటే రాష్ట్ర ఆదాయం మరింతగా పెరిగి దాదాపు 22 శాతం వృద్ధిరేటు నమోదయ్యేదన్నారు.
సీఎస్ఎస్లలో గత 8 ఏండ్లలో రాష్ట్రానికి రు.47,312 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ అధికారులు క్యాబినెట్కు తెలిపారు. గత నాలుగేండ్లలో రైతుబంధు పథకం కిందనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించిందని తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1లక్షా 84 కోట్లు ఖర్చు చేయగా అందులో సీఎస్ఎస్ పథకాల కింద అందింది రూ.5,200 కోట్లు మాత్రమేనని చెప్పారు. అంటే రాష్ట్రం పెట్టిన మొత్తం ఖర్చులో 3 శాతం కంటే తకువ మాత్రమే కేంద్ర పథకాల కింద నిధులు అందాయని పేర్కొన్నారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటుకు కొంచెం బ్రేక్ పడిందని.. రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, రాష్ట్ర జీఎస్డీపీ మరో రూ.3 లక్షల కోట్ల రూపాయలు పెరిగి, రూ.14.50 లక్షల కోట్లకు చేరుకొనేదని అధికారులు అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.5 శాతమే అయినా, దేశ ఆదాయానికి రాష్ట్రం 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నదన్నారు. రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు ఉండగా, ఏడేండ్లలోనే మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఆర్థికశాఖ అధికారులు క్యాబినెట్కు వివరించారు.
ఐటీ రంగంలో తెలంగాణ గత ఏడాది 1.55 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ క్యాబినెట్కు వివరించారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు 1.48 లక్షల ఉద్యోగాలు కల్పించగా, హైదరాబాద్ అంతకంటే ఎకువగా 1.55 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విధానాలు, ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతి భద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, మానవ వనరుల లభ్యత వల్ల ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ను, ఇతర అధికారులను సీఎం కేసీఆర్ ప్రశంసించారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది. ఈనెల 21న పెండ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల, పెద్దఎత్తున వివాహాది శుభ కార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో జీవో 58, 59 కింద పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ను మంత్రివర్గం ఆదేశించింది. గ్రామకంఠం స్థలాల్లో నూతన ఇండ్ల నిర్మాణానికి ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని, సమస్యను శాశ్వతంగా పరిషరించాలని నిర్ణయించింది.
కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్టీ టవర్ నిర్మించాలని క్యాబినెట్ తీర్మానించింది. దవాఖానకు 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకొన్నది. సరోజినీదేవి కంటి దవాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని వైద్యారోగ్య శాఖను క్యాబినెట్ ఆదేశించింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన దవాఖాన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయించింది.