హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా తరహాలో ప్రవేశపెడుతున్న నేతన్నబీమా పథకాన్ని ఆదివారం మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 24న నేతన్నబీమాకు సంబంధించి జీవో 66ను విడుదల చేసిన విషయం విదితమే. అనంతరం దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు.
బీమా వర్తించాలంటే, లబ్ధిదారుడు జియోట్యాగింగ్ జరిగిన మరమగ్గాల నేత కార్మికుడై, లేక అనుబంధ కార్మికుడై ఉండాలి. తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి. 18-59 ఏండ్లలోపు వారికి ఇది వర్తిస్తుంది. ఎల్ఐసీ ద్వారా అమలయ్యే ఈ పథకం కింద లబ్ధిదారుడి ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుం ది. బీమా కాలంలో లబ్ధిదారు మరణిస్తే 10 పనిదినాల్లోగా నామినీ ఖాతాలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ పథకం అమలు కు చేనేత, జౌళిశాఖను నోడల్ ఏజెన్సీగా నియమించారు. నేతన్నబీమా పథకం కోసం రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఇం దులో రూ.25 కోట్లు విడుదల చేసింది. సుమారు 80 వేల మంది చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలుగనున్నది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన
జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో చేనేత కళాకారులను సత్కరించడంతోపాటు వారంపాటు జాతీయస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. ప్రదర్శనలో వివిధ రాష్ర్టాల పేరెన్నికగల వస్ర్తాల స్టాళ్లతోపాటు తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల కాటన్, సిల్క్, సికో జరీ చీరలు, నారాయణపేట కాటన్ డిజైన్ నమూనాలు, పట్టు చీరలు, వరంగల్ డర్రీలు, కరీంనగర్ బెడ్షీట్లు, ఫర్నిషింగ్లకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటుచేయనున్నారు.
ఏటా మాదిరిగానే ఈసారి కూడా 28 మంది ఉత్తమ చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను ప్రదానంచేయనున్నారు. అవార్డు కింద ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతోపాటు రూ.25 వేల నగదు పురస్కారం ఇవ్వనున్నారు. ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా తేలియా రుమాల్, హిమ్రూ వీవ్స్, ఆర్మూర్ పట్టు చీరలు, పీతాంబరి పట్టు జరీ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు తదితర రివైవల్ క్రాఫ్ట్లకు ప్రాచుర్యం కల్పించడంపై దృష్టి పెట్టనున్నారు. జూబ్లీహిల్స్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ నెల 7వ తేదీన సాయంత్రం 25 మంది మోడల్స్తో ఫ్యాషన్ షో నిర్వహించాలని నిర్ణయించారు.
పలు రాష్ర్టాల అభినందన
చేనేత అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి రా ష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలకు చెందిన బృందాలు మన రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి చేపడుతున్న పథకాలను అధ్యయనంచేసి అభినందించాయి.