రెండు వందల ఏండ్ల బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి ఉత్ప్రేరకమైంది ఒక చరఖా.. స్వాతంత్య్ర మహోద్యమానికి విజయ పతాకయై సారథ్యం వహించింది చరఖా.. శాంతి కోదండాన్ని ధరించిన మహాత్ముడు రక్తపు బొట్టు చిందించకుండా సాగించిన మహా యుద్ధానికి బ్రహ్మాస్త్రమై రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నేలకూల్చింది ఒక చరఖా. గాంధీజీ ఇచ్చిన పిలుపుతో యావత్ భారత జాతిని జాగృతం చేసింది చరఖా.. విదేశీ వస్తు బహిష్కరణ చేసి స్వదేశీ దుస్తులు ధరించాలన్న నినాదంలో ప్రతిఫలించింది. ఈ చరఖా వడికిన నూలుపోగు వస్త్రమే.. మహాస్త్రమై తెల్ల దొరలను తరిమికొట్టింది.
ఇప్పుడు ఇదే రాట్నం తన దేశంలో.. తన వాళ్లపైనే మరో యుద్ధం చేయడానికి పూనుకొన్నది. రాట్నం వడికి జాతికి వస్ర్తాన్నం పెడుతున్న నేతన్న తన పాలకులపై తిరుగుబాటు చేసే దుస్థితి నెలకొన్నది. జీఎస్టీ పేరుతో పన్నుపోటు పొడిచిన కేంద్ర ప్రభుత్వంపై రణన్నినాదం చేస్తున్నది. నాడు విదేశీ వస్తు బహిష్కరణకోసం జాతిలో చైతన్యం తెచ్చిన చేనేత.. ఇవాళ తన అస్తిత్వం కోసం తండ్లాడుతున్నది.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా చేనేత రంగాన్ని ప్రత్యేకంగా చూడాలని, చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు విధించరాదని డిమాండ్ చేస్తూ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నేతన్నలు ఊరూరా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేనేతపై జీరో జీఎస్టీ ఉద్యమంలో భాగంగా చేనేత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. చేనేతపై జీరో జీఎస్టీ కోసం తీర్మానాలు చేశారు. ఆ కాపీలను ప్రధాని మోదీకి, రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వ చేనేత వ్యతిరేక విధానాలపై ఆనాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో స్వతంత్ర భారతదేశంలో మన ఉనికిని కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి సిద్ధమవ్వాలని, ఆ మహోజ్వల కార్యక్రమంలో ప్రతి ఒకరూ భాగస్వాములవ్వాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న పిలుపునిచ్చారు.
దారుణంగా పన్నుపోటు
75 ఏండ్ల స్వతంత్ర వజ్రోత్సవాలను నిర్వహించుకొంటున్న తరుణంలోనూ చేనేత కార్మికులు హక్కుల కోసం, వృత్తి పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన దుస్థితి నెలకొనడమే విచిత్రం. చేనేత వస్ర్తాలపై గతంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ పన్నులు విధించలేదు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ చేనేత రంగాన్ని దెబ్బకొట్టే నిర్ణయాలను తీసుకొంటూనే ఉన్నది. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు చిలుపల నూలుపై 9.2 శాతం సెన్వ్యాట్ పన్ను విధించారు. తర్వాత యూపీఏ పాలకులు రద్దు చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేతపై 2017 నుంచి 5 శాతం జీఎస్టీ విధించింది. ఇది తమకు గొడ్డలిపెట్టుగా మారిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం హ్యాండ్లూమ్ మార్చ్ పేరుతో నిరసనలు తెలిపింది. చేనేతపై జీరో జీఎస్టీ కోరుతూ తెలంగాణ నుంచి ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లక్ష ఉత్తరాలు పంపించింది. తాజాగా దేశవ్యాప్తంగా జీరో జీఎస్టీ ఉద్యమాన్ని చేపట్టింది. చేనేతపై జీఎస్టీ తొలగించాలని ప్రధాని మోదీకి దాదాపు 100 మంది పార్లమెంటు సభ్యుల సంతకాలతో ‘చేనేత మహా వస్త్ర లేఖ’ రాయాలని పద్మశాలి సంఘం నిర్ణయించింది. ఇప్పటికే ఆ సంఘం ప్రతినిధులు అన్ని రాష్ర్టాలు తిరుగుతూ వివిధ పార్టీలు, ఎంపీల మద్దతును కూడగడుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ తీర్మానంచేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్పవార్, మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మాజీ మంత్రులు శశిథరూర్, నారాయణ్భాయ్ రత్వ, రాజ్యసభసభ్యుడు కపిల్ సిబల్, అన్నా హజారే వంటి ప్రముఖులు మద్దుతు ప్రకటించారు. 13 రాష్ర్టాలు, 15 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. చేనేత మహా వస్త్ర లేఖపై 65 మంది ఎంపీలు సంతకాలు చేశారు. త్వరలోనే 100 సంతకాలు పూర్తి చేసి ప్రధానికి పంపేందుకు సన్నద్ధమవుతున్నారు.
చేనేత మగ్గాల లెక్కలపై కేంద్రం తప్పుల తడక
నాలుగో జాతీయ సెన్సస్ ప్రకారం దేశవ్యాప్తంగా 26,73,891 చేనేత ముగ్గాలు ఉన్నాయని కేంద్రం చెప్తున్నది. ఆ లెకలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు19 వేల చేనేత ముగ్గాలను గుర్తించింది. జియో ట్యాగింగ్ చేసింది. ఇంకా జియో ట్యాగింగ్ కాని చేనేత మగ్గాలు ఉండగా, వాటిని గుర్తించే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ కేంద్రం తెలంగాణలో 11,544 చేనేత మగ్గాలే ఉన్నట్టు చూపింది.