చిక్కడపల్లి,అక్టోబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలువడం హర్షణీయమని నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ డాక్టర్ జాన్ మస్కు అన్నారు. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ‘దేశంలో క్రైస్తవుల ఐక్యత’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి 29 రాష్ర్టాల నుంచి క్రిస్టియన్ నాయకులు, పాస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా 500 మంది పాస్టర్లకు ఇన్సూరెన్సులు, 30 మందికి డాక్టరేట్లు ప్రదానం చేశారు. అనంతరం జాన్ మస్కు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్కార్ క్రైస్తవులను గుర్తిస్తున్నదని పేర్కొన్నారు.
క్రైస్తవుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తమను దళిత, రెడ్డి, కమ్మ క్రిస్టియన్లుగా కాకుండా ఇండియన్ క్రైస్తవులుగా గుర్తించి సర్టిఫికెట్లను జారీ చేయాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో క్రైస్తవులపై 20వేలసార్లు దాడులు జరిగాయని, వీటిలో 15వేల కేసులపై ఎఫ్ఐఆర్లు నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ ప్రధాన కార్యదర్శి సలోమన్ జోబ్, తెలంగాణ, ఏపీ అధ్యక్షుడు వెంకట్రావు, పంజాబ్ అధ్యక్షుడు రెవ సామ్సన్, ఓఆర్సీ ప్రతినిధి బిషన్ బీమా, నెల్లూరు ఆర్చ్ బిషప్ తిమోతి, గుంటూరు బిషప్ లేవి పాల్గొన్నారు.