హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాలశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ సమయంలోనే సేకరణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ప్రధానమైన నిధులు, గన్నీ సంచులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ అంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి అవసరమైన పైసలు, సంచులను సమకూర్చింది. ఇప్పటికే రూ.7 వేల కోట్ల నిధులను సమీకరించడంతోపాటు 3 కోట్లకు పైగా గన్నీ సంచులను కూడా సమకూర్చింది. ఎలాంటి రుణాలతో సంబంధం లేకుండానే ఈ నిధులు సమీకరించడం గమనార్హం.
మొత్తం 15 కోట్ల గన్నీ సంచులు అవసరమని అంచనా వేయగా, సుమారు 8 కోట్ల కొత్త సంచుల కోసం జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే పౌరసరఫరాలశాఖ లేఖ రాసింది. కొత్త సంచులు వచ్చే వరకు కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇబ్బందిలేకుండా స్థానిక మిల్లర్లు, రేషన్ డీలర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి సంచులను సేకరిస్తున్నది. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకొంటున్నది. మరోవైపు మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో అధికారులు సంప్రదింపులు జరిపారు. సేకరించిన ధాన్యాన్ని దించుకొనేందుకు పలుచోట్ల మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారితోనూ చర్చలు జరిపింది. బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టాన్ని మిల్లర్లపై పడకుండా చర్యలు తీసుకొంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి మిల్లర్లకు ఎంత మొత్తం ఇవ్వాలనేదానిపై సీఎస్ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మిల్లర్లు ధాన్యాన్ని దించుకొనేలా ప్రభుత్వం వారిని ఒప్పించింది. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను సమకూర్చేలా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఒప్పించింది.
7 వేల కొనుగోలు కేంద్రాలు
యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత యాసంగిలో 6,968 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వరి కోతలు మొదలైన నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల్లో 273 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇక పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది.
ఇబ్బంది లేకుండా చర్యలు
ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొంటున్నాం. ఇప్పటికే రూ.7 వేల కోట్ల నిధులతోపాటు 3 కోట్ల గన్నీ సంచులను సమీకరించాం. వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగనివ్వం. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాలశాఖ మంత్రి