CM KCR | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రైతుల పాలిట పెన్నిధిగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో అన్నదాతల సంక్షేమానికి దాదాపు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యధిక ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు ఉచిత విద్యుత్తు, బర్రెలు, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, ధాన్యం కొనుగోళ్లు, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.4,45,297 కోట్లు వెచ్చించింది. ఇందులో అత్యధికంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పాత ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.1.61 లక్షల కోట్లు, ధాన్యం కొనుగోళ్లకు రూ.1.21 లక్షల కోట్లు, ఉచిత విద్యుత్తు పంపిణీకి రూ.49,314 కోట్లు, రైతుబంధు పథకం అమలుకు రూ.65,192 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా రాష్ట్రంలోని మొత్తం 66 లక్షల మంది రైతులకు సగటున రూ.6.74 లక్షల చొప్పున లబ్ధి చేకూర్చింది. దీనిపై వ్యవసాయ, ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుపై ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం అసాధారణమని, అందుకే తెలంగాణ రైతు రాజ్యంగా వెలుగొందుతున్నదని పేర్కొంటున్నారు.
తెలంగాణలో రైతుల బతుకు మారాలంటే వ్యవసాయ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దుల మాదిరిగా ముందుకు నడపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తదనుగుణంగా వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు గొర్రెలు, చేపపిల్లల పంపిణీ లాంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును అనతికాలంలోనే నిర్మించి రికార్డు సృష్టించడంతోపాటు పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం పోసి, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నారు.
ఉద్యమ సమయంలో కాల్వలు, నీళ్లు వస్తయని కేసీఆర్ చెప్పితే ఏందో అనుకొన్నం. సార్ చెప్పినట్టే మా ఊరికి కాల్వ నీళ్లు వచ్చినయి. కండ్ల ముందే పొలాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతున్నయ్. తెలంగాణ రాకముందు నీళ్ల కోసం ఎంతో గోస పడినం. యాసంగిలో బోరు బావులు తవ్వించి అప్పుల పాలైనం. నీళ్లు లేక చాలామంది పొలాలను బీడు పెట్టేటోళ్లు. మాకు 4 ఎకరాలున్నది. ఎకరం వరకు కాల్వకు పోయింది. భూమికి సర్కారు పైసలిచ్చింది. తెలంగాణ రావడంతో పొలాల్లో నీళ్లు పారుతున్నయి.
– రెడ్డబోయిన మాధవి, నర్లేన్గడ్డ, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా
తెలంగాణ రాక మునుపు కరెంటు బాధలు మస్తుపడినం. కేసీఆర్ సారు వచ్చినంక పైసా ఖర్చు లేకుండా బోరు మోటరు నడిపించుంటున్న. 24 గంటలు కరెంటు వస్తున్నది. తెల్లందాక పొలాల కాడికి పోవుడు తప్పింది. సావు బాధలు తప్పినయి. నాకున్న 6 ఎకరాల్లో వరి ఏసిన. కరెంట్ గోస తీరుతుందని కలలో కూడా అనుకోలె. కేంద్రం మోటర్లకు మీటర్లు పెడతదని తెలిసి చానా భయమైంది. కేసీఆర్ సారు మీటర్లు పెట్టవద్దని చెప్పడంతో ధైర్యం వచ్చిం ది. ఇన్ని రకాలుగా రైతులను అరుసుకునే సర్కారును ఇప్పుడే చూస్తున్న.
– గెంటె రాజయ్య, చౌటపల్లి, అక్కన్నపేట మండలం, సిద్దిపేట జిల్లా
పంట ఎయ్యాలంటే అప్పు జెయ్యాల్సిందే. మునుపు పెట్టుబడి కోసం ఆడ ఈడ అప్పు తెచ్చి ఎవుసం చేసేటోన్ని. దేవునసొంటి కేసీఆర్ వచ్చినంక మా పెట్టుబడి బాధలు పోయినయి. లేకుంటే ఆర్నెల్లకోసారి అప్పే దిక్కయ్యేది. నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. తాపకు 15 వేలు రైతుబంధు పైసలు పడుతున్నయి. ఆ పైసల్ని అట్లే పెట్టి దుక్కి మందు, యూరియా, నాటు పనులకు వాడుకుంటున్న. వాళ్లను వీళ్లను అడిగే బాధ తప్పింది. రైతులకు నీళ్లు, కరెంట్ ఉంటే సాలు. కట్టపడి పంట పండిస్తరు. ఈ రెండూ కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇంకా పెట్టుబడి పైసలు కూడా ఇత్తున్నడు. ఇంతకన్నా రైతుకు ఇంకేం చెయ్యాలే. కేసీఆర్ లేకుంటే రైతులు ఆగమయ్యేటోళ్లు.
– ముత్యాలు, తుపాకులపల్లి, మనోహరాబాద్ మండలం, మెదక్ జిల్లా