Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. కమీషన్ను మెట్రిక్ టన్నుకు రూ. 1400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది అదనంగా రూ. 139 కోట్ల భారం పడనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 200 కమీషన్ ఉండే.. ఆ కమీషన్ను కేసీఆర్ సర్కార్ రూ. 1400కు పెంచింది. కరోనా సమయంలో చనిపోయిన 100 మంది డీలర్ల వారసులకు షాపులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
మెట్రిక్ టన్నుకు ప్రస్తుతమున్న కమీషన్ రూ. 900 నుండి రూ. 1400 లకు ముఖ్యమంత్రి ఆదేశంతో పెంచుతున్నట్టు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్ డీలర్లకు లబ్ది చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ. 139 కోట్ల అధనపు భారం పడుతుందని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రంలోని అన్నివర్గాల్లోని ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని కేసీఆర్ చూస్తున్నారని, రేషన్ డీలర్లను సైతం ఆదుకోవాలని ఆదేశించారని మంత్రులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కేవలం మెట్రిక్ టన్నుకు రూ. 200 కమీషన్ మాత్రమే ఉండేదని ప్రస్తుతం దానిని రూ. 1400 లకు పెంచామన్నారు. అతి తక్కువ సమయంలో 700 శాతం కమిషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అదనంగా ఇవ్వడం లేదని కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అదనంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కమీషన్ సైతం కేంద్రం పెంచకున్నా పెంచి అందిస్తున్నామన్నారు.
ఏక మొత్తంగా రూ. 1400 కమీషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను ప్రభుత్వం పరిష్కరించిందని మంత్రులు తెలిపారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడ తదితర బీమాల తరహాలో రేషన్ డీలర్లకు రూ. 5 లక్షల బీమా అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతీ డీలర్ను తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్షిప్ రెన్యూవల్ని ఐదేండ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్షిప్ వయోపరిమితిని 40 నుండి 50 ఏండ్లకు పెంచడం, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం రూ. 10 వేలు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్ను కేసుల పరిధి నుండి తీసివేయడం, హైదరాబాద్లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై సానుకూలత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
డీలర్ల కమీషన్ పెంపు సహా తమ ఇతర సమస్యల పరిష్కారించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ కడుపునిండా అన్నం పెట్టేలా కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్కు, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు సమావేశంలోనే ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ వి అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.