హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంసహా వస్త్ర పరిశ్రమల సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, నష్టాల నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని సహకార, చేనేత, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వస్త్ర పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోవడంతో పరిశ్రమలను మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ఇబ్బంది కలుగకుండా, పరిశ్రమలు మూతపడకుండా చూడాలని కోరారు. స్కూల్ యూనిఫామ్స్సహా ప్రభుత్వ ఆర్డర్లను వెంటనే చిన్నతరహా పరిశ్రమలు, చేనేత సహకార సంఘాలకు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర చేనేతశాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, రీజినల్ డైరెక్టర్ అశోక్రావు తదితరులు పాల్గొన్నారు.
కొద్ది నెలలుగా పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మాంద్యం కారణంగా తీవ్ర నష్టాలపాలైంది. దీని కారణంగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తులు పెరిగి గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయి. హైదరాబాద్సహా వివిధ మారెట్లలో పాలిస్టర్ వస్త్రాల అమ్మకాలు తగ్గిపోవడంతో కార్మికులకు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సభ్యులకు పని కల్పించలేక, సకాలంలో జీతాలు అందించలేక పలువురు యజమానులు తమ ఫ్యాక్టరీలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.