ముమ్మరంగా సాగుతున్న కొనుగోళ్లు
3,500కు పైగా కేంద్రాలు ఏర్పాటు
కొనుగోళ్లపై ప్రతిపక్షాల రాజకీయం
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 3,500కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 40 వేల మంది రైతుల నుంచి 3.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నది. రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలయ్యాయి. ఆయా గ్రామాల్లో స్థానిక అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు.
ఇంకొందరు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టడం, జల్లెడ పట్టడం చేస్తున్నారు. కొనుగోళ్లపై ఎక్కడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేయటం లేదు. అయితే, కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని కుట్రలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ధాన్యం కొనలేదంటూ, కేంద్రాలు ప్రారంభించలేదంటూ ఆయన చేసే ఆరోపణలను రైతులే తిప్పికొడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు, కల్లాలకు వెళ్తున్న బీజేపీ నాయకులను తరిమికొడుతూ బుద్ధి చెప్తున్నారు.