హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): గిరిజన కళకు సర్కారు సరికొత్త జీవం పోస్తున్నది. ఆదరణ లేదని, తమతోనే కళ అంతమై పోతుందని కుమిలేవారికి అభయహస్తం అందిస్తున్నది. ఆదరించి ముందుకు నడిపిస్తున్నది. కొత్తగా సంప్రదాయ కళలు నేర్చుకునే నవయువతరానికి భవిష్యత్తును సమకూరుస్తున్నది. ఔత్సాహిక ఆదివాసీ, గిరిజన యువతను గుర్తించి ఆయా కళారంగాల్లో నిష్ణాతులైనవారితో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే వస్తు ప్రదర్శనల్లో గిరిజన యువత రూపొందించిన కళాకృతులు ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నది.
గోండ్, కోయ, నాయక్పోడ్ జీవన సంస్కృతిని ప్రతిబింబించే పెయింటింగ్స్, డోక్రా మెటల్ క్రాఫ్ట్, పడిగెలు, మాస్క్ల వంటి కళాకృతులు మరుగునపడిపోకుండా వెలుగులోకి తెస్తున్నది. ఈ కళాకృతులకు విస్తృతస్థాయిలో మార్కెట్ను కల్పించేందుకు గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నాయక్పోడ్, ఓజా గోండు కళాకారులకు రూ.32.15 కోట్లతో సూక్ష్మ చెక్క ప్రతిమలు, డోక్రా మెటల్ క్రాఫ్ట్ యూనిట్లను ప్రభుత్వం మంజూరుచేయడం వల్ల భద్రాచలం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ఆ జాతి కళాకారులు రూపొందించే కళాకృతులు, పెయింటింగులకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఎమ్మెస్సీ, బీఈడీ, సివిల్ ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివిన గిరిజనులు కళాత్మక వస్తువుల తయారీ యూనిట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇతరులకు జీవనోపాధి కల్పిస్తున్నారు.
రాష్ట్రపతి మెచ్చిన ‘నాయక్’ కళ
నాయక్పోడ్ గిరిజన కళాకారులు రూపొందించిన కళాకృతులను చూసి రాష్ట్రపతి ముచ్చటపడ్డారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నాయక్పోడ్ కళాకృతులైన ‘శిరస్సు’లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర గిరిజనశాఖకు పంపింది. అక్కడి నుంచి అవి రాష్ట్రపతికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తమ కళకు ఈ స్థాయి గుర్తింపు, గౌరవం లభించిందని నాయక్పోడ్ కళాకారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గతంలో తమ కళలు బయటి ప్రపంచానికి తెలిసేవి కాదని నాయక్పోడ్ కళాకారుడు పసుల అంజన్కుమార్ తెలిపారు.
ఆదరణ పెరుగుతున్నది
ప్రభుత్వ సహకారంతో నాయక్పోడ్ కళకు ఇప్పుడిప్పుడే ఆదరణ వస్తున్నది. మాకు అవసరమయ్యే ‘పొనికి కర్ర’ను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
–పసుల అంజన్కుమార్, నాయక్పోడ్ కళాకారుడు
అమెజాన్లోనూ నా పెయింటింగ్స్
నేను వేసిన పెయింటింగ్స్ కావాలనుకొనేవారు అమెజాన్లో ఆర్డర్ ఇవ్వొచ్చు అని చెప్పటానికి ఎంతో గర్వపడుతున్నా. ఇంత గొప్ప అదృష్టం నాకు ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ మా కళలో మార్పులు తెచ్చింది. ఒరిజినల్ ైస్టెల్కు మోడ్రన్ లుక్ ఇవ్వటం వల్ల చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. –మడావి రాజేశ్వర్, గోండ్ పెయింటర్, జైనూర్, ఆసిఫాబాద్
మాకు ప్రత్యేక గుర్తింపు
డ్రాయింగ్లో టీటీసీ చేసిన. మా కథలు, గాథలను మా పెద్దవాళ్లు చెప్తుంటే విని వాటికి చిత్రరూపం ఇవ్వాలనుకున్నా. గండభేరుండ పక్షి పెయింటింగ్కు మంచి ఆదరణ లభిస్తున్నది.
– కుస్రం శ్రీధర్, కన్నాయిగూడెం, ములుగు జిల్లా
ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త ఉపాధి
మా కళల్ని ప్రభుత్వం వెలుగులోకి తెస్తున్నది. ఐటీడీఏల్లోనే కాకుండా హైదరాబాద్లోనూ ప్రభుత్వం మాకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అది ఎంతో ఉపయోగపడింది.
-వట్టం నవీన్, మంగపేట, ములుగు జిల్లా