హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ‘విద్య, వైద్యం మా ప్రాధాన్యం. విద్యారంగానికి బడ్జెట్లో నిధుల వాటా పెంచుతాం. మొత్తం బడ్జెట్లో 15 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తాం..’ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. కానీ, తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యకు 7.75 శాతం నిధులనే కేటాయించింది. ఇచ్చిన హామీలో సగానికే పరిమితం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో విద్యారంగానికి రూ.21,389 కోట్లు కేటాయించారు.
పాఠశాల విద్యకు రూ.17,931.42 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,959.10 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.487.64 కోట్లు కేటాయించారు. 15 శాతం నిధులంటే దాదాపుగా రూ.40 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించాల్సి ఉండే. కానీ, ఈ దిశగా బడ్జెట్ కేటాయింపులను పెంచలేదు. బడ్జెట్లో విద్యకు సముచిత ప్రాధాన్యం దక్కలేదని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు విస్మయం వ్యక్తంచేశాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభిస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పటికే నడుస్తున్న సర్కారు స్కూళ్లను విస్మరించిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పినట్టు 15 శాతంలో సగం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యమివ్వలేదని టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి కేటాయించిన నిధులు సరిపోవని ఏఐఎస్ఎఫ్, విద్యారంగానికి నూతన ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు ఆరోపించాయి.