హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుల డీపీఆర్ల సత్వర ఆమోదానికి చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు ఓ లేఖను రాసింది. దీంతో త్వరలోనే బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని, ఆ సమావేశ ఎజెండాలో పొందుపర్చాల్సిన అంశాలను తెలియజేయాలని ఇప్పటికే జీఆర్ఎంబీ ఇరు రాష్ర్టాలకు లేఖలు రాసింది.
ఈ నేపథ్యంలో ఎజెండాలో చేర్చాల్సిన పలు అంశాలను బోర్డుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా డీపీఆర్లకు సంబంధించిన అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చాలని ప్రతిపాదించింది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను సమర్పించామని, వాటిలో 5 డీపీఆర్లకు ఆమోదం లభించిందని తెలిపింది. ప్రస్తుతం సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల డీపీఆర్లు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నది. వాటి డీపీఆర్లకు కూడా త్వరగా ఆమోదం లభించేందుకు చొరవ చూపాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది.