హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 60 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టడానికి టీఎస్పీఎస్సీకి అనుమతి లభించింది. గతంలో కేసీఆర్ సర్కారు 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది.
ఈ పరీక్షకు 3,80,081 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్న పత్రాల లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దుచేసి మళ్లీ జూన్ 11వ తేదీన నిర్వహించింది. అప్పుడు బయోమెట్రిక్ పద్ధతిలో నిర్వహించలేదని కొందరు కోర్టును ఆశ్రయించగా ప్రిలిమ్స్ను మళ్లీ రద్దు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో టీఎస్పీఎస్సీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 60 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది.
గత నోటిఫికేషన్కు కొత్త ఉద్యోగాలను జత చేస్తే మొత్తం సంఖ్య 563కు చేరుతుంది. అయితే.. సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకొని మొత్తం పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తుందా? లేక.. గత నోటిఫికేషన్ యథావిధిగా ఉంచి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తుందా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. కొత్త పోస్టుల్లో అత్యధికంగా పోలీసుశాఖలో డీఎస్పీలు 24 ఉండగా, పంచాయతీరాజ్లో ఎంపీడీవో పోస్టులు 19 ఉన్నాయి. మిగతా ఏడు రకాల ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య ఒకటి, రెండు, మూడు, నాలుగులోపే ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో జాబ్గ్యారెంటీ అంటూ ప్రకటనలిచ్చిన విషయం తెలిసిందే. చెప్పిన సమయానికి నోటిఫికేషన్ ఇవ్వకపోవటంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు.