హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. వరుస ఉద్యోగాల ప్రకటనలతో రాష్ట్రంలో కొలువుల జాతర సాగుతుండగా, గురువారం 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగంలో 165 ఏఎస్వో (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత 126 ఎంపీడీవో, 95 నాయబ్ తహసీల్దార్ ఉద్యోగాలు ఉన్నాయి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.
పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4తోపాటు పోలీస్, అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర విభాగాల్లో భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. 503 గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష పూర్తి కాగా 2-3 రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. దీంతోపాటు అత్యధికంగా 17,291 పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుతం దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. అనతికాలంలోనే ప్రభుత్వం వేలాది ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేస్తుండటంతో నిరుద్యోగులు కొలువు సాధించేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
పెరిగిన 120 పోస్టులు
తొలుత గ్రూప్-2 కింద 663 పోస్టులు, గ్రూప్-3 కింద 1,373 పోస్టులను గుర్తిస్తూ ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే అప్పటికే గ్రూప్-2 పరిధిలో 16 రకాల సర్వీసు ఉద్యోగాలు ఉండగా, కొత్తగా మరో ఆరు క్యాటగిరీ పోస్టులను పెంచుతూ నవంబర్ 24న నిర్ణయం తీసుకొన్నది. కొత్తగా చేర్చిన క్యాటగిరీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (రాష్ట్ర ఎన్నికల కమిషన్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువెనైల్), సహాయ బీసీ సంక్షేమాధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమాధికారుల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వేర్వేరు పరీక్షలు నిర్వహించడం కన్నా ఒకే హోదా కలిగిన పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రూప్-2లో మొత్తం 22 రకాల పోస్టులు చేరాయి. గతంలో అనుమతి ఇచ్చిన 663 పోస్టులకు 120 ఉద్యోగాలు కలిపి 783 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది.
నేటి నుంచి గ్రూప్-4 దరఖాస్తులు
9,168 పోస్టులతో ఇప్పటికే టీఎస్పీఎస్సీ జారీ చేసిన గ్రూప్-4 ఉద్యోగాలకు శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వచ్చే నెల 19 సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.