హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ): నిరుటి యాసంగి మిగులు ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయానికి సిద్ధమైంది. ఈ మేరకు టెండర్ విధి విధానాలను రూపొందించేందుకు ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఆర్థిక శాఖ సీనియర్ అధికారి, సివిల్ సైప్లె కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
టెండరు విధి విధానాలు, బిడ్ సెలెక్షన్, టెండర్ ప్రాసెస్ వంటి అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. 2022-23 యాసంగిలో ప్రభుత్వం 65.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పడంతోపాటు వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో తొలిదశలో 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని గత ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది. తక్కువ ధర వచ్చిందనే ఉద్దేశంతో తొలి టెండర్లను రద్దు చేసి టెండర్లను మళ్లీ పిలిచింది. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడతో ఆ ప్రక్రియను ఈసీ నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో మళ్లీ ధాన్యం విక్రయానికి టెండర్లను పిలువనున్నది.