హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): పేదల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి మరే రాష్ట్రం సాటి లేదని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కమీషన్ పెంపుతో పాటు ఇతర తమ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రుల నివాసంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు మెట్రిక్ టన్నుకు రూ.200 ఉన్న కమీషన్ను ప్రస్తుతం సీఎం కేసీఆర్ రూ.1400కు పెంచడమే కాక, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం కోసం వేబ్రిడ్జిల ఏర్పాటు, కరోనాతో చనిపోయిన డీలర్ల కుటుంభ సభ్యుల కారుణ్య నియామకం, అంత్యక్రియల కోసం పదివేల తక్షణ సాయం, షాపుల రెన్యువల్ 5 ఏండ్లకు పెంపు, ఏజ్ రిలాక్సేషన్ తదితర సౌకర్యాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల జేఏసీ అధ్యక్షుడు రాజు, ప్రతినిధులు పుస్తే శ్రీకాంత్, అజీజ్, శ్రీధర్ వల్లాల, చంద్రం తదితరులు పాల్గొన్నారు.