హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు అవార్డుల పంట పండింది. 2021-22 సంవత్సరానికి ఏకంగా 441 దవాఖానలను కాయకల్ప అవార్డులు వరించాయి. ప్రభుత్వ దవాఖానల్లో పరిశుభ్రతను, రోగవ్యాప్తి నివారణ చర్యలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం విభాగాలవారీగా ఈ అవార్డులను ప్రవేశపెట్టింది. వీటిని అందుకొనే జిల్లా దవాఖానకు ప్రథమ బహుమతిగా రూ.50 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.20 లక్షలు, ప్రోత్సాహక బహుమతి కింద రూ.3 లక్షలు ఇస్తారు. ఏరియా దవాఖాన, సీహెచ్సీకి ప్రథమ బహుమతిగా రూ.15 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.10 లక్షలు, పోత్సాహక బహుమతిగా రూ.లక్ష అందజేస్తారు. ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.2 లక్షలు, ప్రోత్సాహక బహుమతి కింద రూ.50 వేలు ఇస్తారు. యూపీహెచ్సీలకు ప్రథమ బహుమతిగా రూ.5 లక్షలు, ప్రోత్సాహక బహుమతిగా రూ.50 వేలు అందజేస్తారు. హైదరాబాద్లోని యూపీహెచ్సీలకు ప్రథమ బహుమతిగా రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.1.50 లక్షలు, ప్రోత్సాహక బహుమతిగా రూ.1 లక్ష, ప్రత్యేక బహుమతిగా రూ.50 వేలు ఇస్తారు.
సిద్దిపేట జిల్లాకు 14 అవార్డులు
సిద్దిపేట జిల్లాలో 14 దవాఖానలకు అవార్డులు వచ్చాయి. జిల్లా, ఏరియా దవాఖానతోపాటు 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 సబ్ సెంటర్లు, 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు దక్కాయి. జిల్లాలోని బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 82.6 పాయింట్లతో అగ్రగామిగా నిలిచింది. మిగిలిన 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన రాజగోపాల్ పేట 80.8 పాయింట్లు, తిమ్మాపూర్ 80.0, పుల్లూరు 77.5, కోహెడ 76.7, తీగుల్ 74.2, వర్గల్ 72.5 పాయింట్ల సాధించాయి. జిల్లాలో ఉత్తమ పట్టణ ఆరోగ్య కేంద్రాలుగా సిద్దిపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, అంబేదర్నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపికయ్యాయి. దీనిపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ను అభినందించారు. వచ్చే ఏడాది జిల్లాలోని 100% దవాఖానలు కాయకల్ప అవార్డులను కైవసం చేసుకొనేలా కృషిచేయాలని సూచించారు.
స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం బలోపేతం: హరీశ్
రాష్ట్రంలో 441 దవాఖానలు కాయకల్ప అవార్డులకు ఎంపిక కావడంపై మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆయా దవాఖానల్లోని వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్యసేవల్లో నాణ్యతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయనటానికి ఈ అవార్డులే నిదర్శమని పేర్కొన్నారు. పీహెచ్సీ స్థాయి నుంచే నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు ‘దవాఖానల్లో ఓపీ, ఐపీ, సర్జికల్ సహా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగింది. విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. పరిశుభ్రతతోపాటు పేషెంట్ కేర్, ఇన్ఫెక్షన్ కంట్రోల్కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి’ అని మంత్రి హరీశ్ పేరొన్నారు.