ఇప్పటికే 115 దవాఖానలకు..
కొత్తగా మరో పదింటికి జారీ
దేశంలో 3వ స్థానంలో రాష్ట్రం
హైదరాబాద్, మార్చి 26 : రాష్ట్రంలో మొత్తం 125 దవాఖానలకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్లు వచ్చాయి. ఇప్పటికే 115 దవాఖానలకు నాణ్యత సర్టిఫికెట్లు ఉండగా, కొత్తగా మరో 10 పీహెచ్సీలకు ధ్రువపత్రాలు అందాయి. తద్వారా దేశంలోనే అత్యధిక ‘ఎన్క్వాస్’ దవాఖానలు ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి మరో నిదర్శనమిది. నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను చేరుకొంటే ఎన్క్వాస్ సర్టిఫికెట్ వస్తుంది. దీనికి మూడేండ్ల వ్యాలిడిటీ ఉంటుంది.
కొత్తగా సర్టిఫికెట్లు వచ్చిన పీహెచ్సీలు
నల్లగొండ – నాంపల్లి, సూర్యాపేట- పెన్పహాడ్, జనగామ – లింగాల ఘనపూర్, సంగారెడ్డి – కొండాపూర్, భద్రాద్రి కొత్తగూడెం -పర్ణశాల, జగిత్యాల-ఖిలాగడ్డ, పెగడపల్లి, జయశంకర్ భూపాలపల్లి – రేగొండ, వరంగల్ – ఉప్పల్, మేడ్చల్ మల్కాజిగిరి – పర్వత్నగర్.
రాష్ట్రంలో నాణ్యమైన వైద్యానికి నిదర్శనం: మంత్రి హరీశ్
రాష్ట్రంలోని మరో 10 పీహెచ్సీలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్ రావడంపై మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 125 దవాఖానలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్ వచ్చిందని, దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పీహెచ్సీ స్థాయి నుంచే నాణ్యమైన వైద్యం అందుతున్నదని చెప్పడానికి కేంద్రం ఇచ్చిన ఈ గుర్తింపు ఒక నిదర్శనమని అన్నారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు ఎన్క్వాస్ గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర వైద్యారోగ్యరంగం దేశానికే ఆదర్శంగా మారుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయని, విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, ఓపీ, ఐపీ, సర్జికల్ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగిందన్నారు.