అమరావతి : టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి ( SVIMS ) లో ఉద్యోగాల భర్తీ జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ( Karunakar reddy ) డిమాండ్ చేశారు. 303 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిబంధనలను పాతరేసారని, పారదర్శకత కోల్పోయిందని శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆరోపించారు. ముందే ఎంపిక చేసిన అభ్యర్థుల కోసమే నోటిఫికేషన్ రూపొందించారని, ప్రశ్నాపత్రాల రూపకల్పనలో పక్షపాతం జరిగిందని విమర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబు బంధువు ఆదిశేషయ్య స్విమ్స్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయని వివరించారు. ఏపీపీఎస్సీ లేదా, స్వతంత్ర సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించలేదని అన్నారు. పారా మెడికల్, నాన్ పారామెడికల్ పోస్టుల భర్తీ విషయంలో ప్రముఖ ఎయిమ్స్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల ద్వారా సిలబస్ ప్రశ్నాపత్రాలు రూపొందించాల్సింది ఉండగా సొంతగా కమిటీగా ఏర్పడి ప్రశ్నలు తయారు చేసుకున్నారని ఆరోపించారు.