హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో రైతులు బ్యాంకు రుణం పొందటం ఓ ప్రహసనం. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చేవి కావు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి రైతుల చెప్పులు అరిగేవే కానీ రుణం మాత్రం మంజూరయ్యేది కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు కేంద్రీకృత పథకాలతో రైతులకు పంటరుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. అడిగిందే తడువుగా అవసరమైన మేర రుణాలను మంజూరు చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎనిమిదేండ్లలో రూ.2.54 లక్షల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రైతులకు అందించింది.
రూ.18 వేల కోట్ల నుంచి రూ.42 వేల కోట్లకు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో అంటే 2014-15లో రాష్ట్రంలోని రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణం నామమాత్రమే. ఆ ఏడాది 28 లక్షల మంది రైతులకు కేవలం రూ.18,419 కోట్ల రుణం మాత్రమే ఇచ్చాయి. ఆ తర్వాత ఏడాది నుంచి రుణాల మంజూరులో క్రమంగా పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ పథకాలతో బ్యాంకర్లలో నమ్మకం పెరిగింది. దీంతో ఎలాంటి సందేహం లేకుండా రైతులకు రుణాలు మంజూరు చేయటం ప్రారంభించారు. ఈ విధంగా 2017-18లో రుణాల సంఖ్య రూ.31 వేల కోట్లకు పెరగగా, 2018-19లో రూ.33 వేల కోట్లకు, 2019-20లో రూ.37 వేల కోట్లు, 2020-21లో రూ.41 వేల కోట్లకు పెరిగింది. ఇక 2021-22లో రికార్డు స్థాయిలో రైతులకు ఇచ్చిన రుణాల మొత్తం రూ.42,854 కోట్లకు చేరటం గమనార్హం.
ప్రభుత్వ పథకాలతో బ్యాంకర్లలో పెరిగిన నమ్మకం
గతంలో తెలంగాణ అంటేనే కరువు కాటకాలకు కేరాఫ్. అలాంటి ప్రాంత రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జంకేవి. ఇందుకు కారణం పంటలే లేనప్పుడు రైతులు రుణాలు తిరిగి చెల్లించరనే భయం వాళ్లలో ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతులను ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకొచ్చేందుకు ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, రైతుబంధు, రైతుబీమా వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేశారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. పుష్కలమైన పంటలు పండుతున్నాయి. పుట్ల కొద్ది ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. ఈ నేపథ్యంలో రైతుల రుణాల చెల్లింపుపై బ్యాంకర్లకు నమ్మకం ఏర్పడింది. రైతులు అడిగిందే తడువుగా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. దీంతో పాటు విరివిగా రుణాలు ఇచ్చేలా బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. రుణాలు ఇవ్వటంలో సమస్యలు లేకుండా చేసింది.