హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే.. హక్కుగా ఇవ్వాల్సిన నిధుల్లోనే కోతలు విధిస్తారు. కేంద్ర పథకాల్లో ప్రాధాన్యమివ్వాలని కోరితే.. పెడచెవిన పెడతారు. బియ్యం కొనండి బాబు అంటే.. నూకలు తినమంటూ అవమానిస్తారు. సమస్యలను విన్నవించడానికి వెళ్తే.. ‘ఎందుకొచ్చారు? పనేమీ లేదా?’ అంటూ ఈసడించుకుంటారు. ఢిల్లీలో అవార్డులు, ప్రశంసలతో తెలంగాణను ముంచెత్తినా.. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి అదనం ఒక్కపైసా విదల్చరు. ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు గత తొమ్మిదేండ్లుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, ఉపాధి కల్పనకు చట్టబద్ధంగా అమలు చేయాల్సిన వాటిని పట్టించుకోని వైనం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని దైన్యం. అయినా స్వశక్తితో ఎదుగుతున్న తెలంగాణ పట్ల ఓర్వలేనితనంతో వ్యవహరిస్తున్న కేంద్రంపై యావత్ తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
అడుగడుగునా తీరని అన్యాయం
అభివృద్ధి నిధులు, పథకాలు, ప్రాజెక్టుల మంజూరు సహా అన్ని అంశాల్లోనూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఆది నుంచి వివక్ష చూపుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణను విస్మరిస్తుస్తున్నది. ములుగులో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని ఏపీకి.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు తరలించింది. హైదరాబాద్కు దక్కాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తీరని ద్రోహం తలపెట్టింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్తోపాటు ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వరదలు సంభవించినప్పుడు నిధుల వరద పారించిన కేంద్ర ప్రభుత్వం.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరదలతో అతలాకుతలమైన హైదరబాద్కు నయాపైసా విదల్చలేదు. హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఆర్బిట్రేషన్ సెంటర్) ఏర్పాటుకు పైసా ఇవ్వకపోగా గుజరాత్లో మరో ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం మోదీ సర్కార్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ‘బల్క్ డ్రగ్ పార్క్’ పథకంలో గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఏపీలకు చోటు కల్పించి అన్ని అనుకూలతలున్న హైదరాబాద్కు కేంద్రం మరో వెన్నుపోటు పొడించింది. భారీ లాభాలను గడిస్తున్న సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా ఆ సంస్థను ప్రైవేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నది.
రాష్ట్ర ప్రయోజనాలు పట్టని బీజేపీ నేతలు
తెలంగాణ డిమాండ్లను, సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వంపైనే అడ్డగోలు విమర్శలకు దిగుతుండడం వారి రెండు నాల్కల ధోరణిని తెలియజేస్తున్నది. రేషన్ షాపుల్లో మోదీ ఫొటోలు లేవంటూ కయ్యానికి దిగడం కేంద్ర సంకుచిత బుద్ధిని బయటపెడుతున్నది. మరోవైపు తెలంగాణ ప్రయోజనాలపై రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతోపాటు సీఎం కేసీఆర్పై, రాష్ట్ర మంత్రులపై నిత్యం వ్యక్తిగత విమర్శలకు దిగడమే తప్ప తెలంగాణ హక్కుల గురించి పార్లమెంట్లో గానీ, కేంద్ర మంత్రుల వద్ద గానీ ప్రస్తావించిన దాఖలాలే లేవు. రాష్ర్టానికి కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరు చేయించలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. హైదరాబాద్ గల్లీల్లో వీరాంగాలు వేసే కాషాయ నేతలు.. ఢిల్లీలో కిక్కురుమనకపోవడం, తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టడం, బడా నేతలను కలుసుకోవడమే మహాభాగ్యంగా భావించి ఢిల్లీ నుంచి వెనుదిరగడం పరిపాటిగా మారిపోయింది.
అవార్డులు, ప్రశంసలకే పరిమితం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి విధానాలు, తాగు, సాగునీరు, పారిశ్రామిక, వ్యవసాయ, ఐటీ రంగాల విస్తరణకు రూపొందించిన పాలసీలు యావత్ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. వీటిపై అనేక రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా తెలంగాణకు వచ్చి అధ్యయనం చేయడంతోపాటు, తమ రాష్ట్రాల్లోనూ అమలుకు పూనుకొంటున్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పలు పథకాలపై ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు ఇటీవల ఖమ్మం బహిరంగ సభా వేదికపై ప్రశంసించడంతోపాటు, తమ రాష్ర్టాల్లోనూ అమలుకు శ్రీకారం చుడతామని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్లో ప్రస్తావించడంతోపాటు మిషన్ భగీరథ లాంటి పథకాలు అద్భుతమంటూ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ కొనియాడారు. కేంద్ర మంత్రులు సైతం సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించి అనేక అవార్డులను ప్రకటించారు. కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం అదనంగా ఒక్క పైసాను విదల్చకపోవడం మోదీ సర్కారు దమన నీతికి నిలువెత్తు నిదర్శనం.
రాష్ట్ర ప్రగతికి సవాలక్ష ఆటంకాలు
కేంద్రం వీసమెత్తు సాయం అందించకున్నా స్వశక్తితో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఎవరూ ఊహించని విధంగా తొమ్మిదేండ్లలో పలు గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను నమోదు చేసింది. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. మరోవైపు తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని సూచీలు అట్టడుగుకు దిగజారాయి. దీంతో తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు పలు కుట్రలకు తెరలేపింది. ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణపై కాగ్, నీతి ఆయోగ్ సహా పలు కేంద్ర సంస్థలు ప్రశంసల వర్షం కురిపించి అదనంగా నిధులు ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. పైపెచ్చు చట్టబద్ధంగా రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లోనూ కోతలు పెడుతున్నది. అక్కడితో ఆగకుండా విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రుణాలిచ్చిన సంస్థలపై ఒత్తిడి పెంచి రాష్ర్టానికి నిధులు రాకుండా మోకాలడ్డుతున్నది. ఎరువుల కేటాయింపు నుంచి పంటల కొనుగోళ్ల వరకు నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చుతూ తెలంగాణకు అనేక కొర్రీలు పెడుతున్నది.