కేంద్రం నిరాకరిస్తుండటంతో మంత్రుల సమాలోచనలు
మరోసారి సమావేశానికి నిర్ణయం
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి సీఎంఆర్ (బియ్యం) తీసుకొనేందుకు ఎఫ్సీఐ నిరాకరిస్తుండటంతో ఏం చేయాలనేదానిపై శుక్రవారం మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంత ధాన్యం నిల్వ ఉన్నది? ఎన్ని బియ్యం అందుబాటులో ఉన్నాయి? ఎఫ్సీఐకి ఎంత ఇవ్వాలి? వంటి అంశాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి నివేదికను సీఎం కేసీఆర్కు అందజేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మంత్రులు సోమ లేదా మంగళవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సమీక్షలో సీఎస్ సోమేశ్కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ పాల్గొన్నారు.
పథకాల అమలుపై సీఎస్ సమీక్ష
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, సంస్కరణ కార్యక్రమాల అమలుపై శాఖలవారీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ రెండు రోజులుగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎనిమిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, ఇప్పుడు అమలులో ఉన్న కార్యక్రమాల పురోగతిపై ఆయా శాఖల కార్యదర్శులు సీఎస్కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత అమలులోకి తెచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు సంస్కరణల ఫలితాలు ఏవిధంగా ప్రజలకు అందాయి? ప్రజలకు చేరవేయడంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? పథకాల అమలు పకడ్బందీగా ఉన్నదా? ఏమైనా లోపాలున్నాయా? ఒక వేళ లోపాలుంటే ఏవిధంగా సరిచేసి ప్రజలకు పక్కాగా అందేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నదానిపై చర్చించినట్టు తెలిసింది.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వినూత్నంగా ఆలోచించి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. పరిపాలన ప్రజలకు చేరువ చేయడానికి 10 జిల్లాలను 33గా విభజించారు. దీంతో అధికార యంత్రాంగం ప్రజలకు మరింత దగ్గరైంది. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించేలా తీసుకొచ్చిన పెన్షన్లు ఏవిధంగా అందుతున్నాయి? ఇంకా ఎక్కడైనా పెన్షన్ ఎంపికలో ఇబ్బందులున్నాయా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా పథకాల అమలు ఎలా ఉన్నది? అని అడిగినట్టు సమాచారం. అన్ని శాఖలపై సమీక్ష తరువాత వచ్చిన ఫీడ్ బ్యాక్ను సీఎం కేసీఆర్కు సీఎస్ నివేదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.