హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్.. విద్యార్థి జీవితానికి గేట్వే. ఉన్నత విద్యకు మలుపు లాంటిది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఇంటర్ విద్యతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతున్నది. అస్తవ్యస్త నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తున్నది. ఇంటర్ విద్య విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు పిల్లలాటను తలపిస్తున్నది. తాజాగా ఇంటర్బోర్డును పాఠశాల విద్యలో విలీనంచేసేందుకు ప్రయత్నించి, ఆదివారం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది.
సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని, ఇప్పటికిప్పుడు వీలుపడదని తేల్చేసింది. ఇదొక్కటే కాదు.. అనేక విషయాల్లోనూ కాంగ్రెస్ సర్కార్ ఇలాగే చేసింది. ఈ రెండేండ్లలో ఇంటర్ విద్యను సర్కార్ ప్రయోగశాలగా మార్చేసిందన్న ఆరోపణలున్నాయి. ముందు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం సర్కార్కు రివాజుగా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండగా గందరగోళం నెలకొనడంపై విద్యారంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత సర్కార్ సీరియస్గా స్పందించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇంటర్బోర్డు ఇంకా రద్దు కాలేదా..? మేం రద్దు చేయమని చెప్పాక తాత్సారమెందుకు? అని సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారట. ఇదిలా ఉంటే కొందరు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇటీవలే ప్రభుత్వ సలహాదారు, ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ కే కేశవరావును కలిశారు. ఎన్ఈపీ అమలుపై స్పష్టత, కాలేజీలకు బోర్డు విధించిన జరిమానాలను రద్దుచేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేకే, ఇంకెక్కడి ఇంటర్బోర్డు. బోర్డును రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నం కదా.. అంటూ వ్యాఖ్యానించారట. ఇంటర్బోర్డును రద్దుచేస్తే ఇబ్బందులు తప్పవని కాలేజీ యాజమాన్యాలు హెచ్చరించాయట.
నిజానికి ఇంటర్బోర్డును రద్దు చేయాలంటే అసెంబ్లీలో కొత్తగా చట్టం చేయాలి. లేదా ఆర్డినెన్స్ జారీచేయాలి. అయినా బోర్డు రద్దు కాలేదా? అంటూ సర్కార్ పెద్దలు అధికారులను ప్రశ్నించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా ఇటీవలే ఇంటర్బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యను సర్కార్ బదిలీ చేసింది. కొత్త సెక్రటరీగా అభిలాష అభినవ్ను నియమించింది. బోర్డు రద్దు అయితే కొత్త సెక్రటరీని ఎందుకు నియమించినట్టు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై సర్కార్ వెనక్కి తగ్గింది. కొత్త విద్యాసంవత్సరంలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించింది. ఇంటర్ బోర్డు విలీనాన్ని అధ్యాపక సంఘాలు, ప్రైవేట్ జూనియర్ కా లేజీల యాజమాన్యాలు వ్యతిరేకించాయి.
ఈ విద్యాసంవత్సరం ఇంటర్ ప్రవేశాలను యథావిధిగా చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. బోర్డు విలీన అంశంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, సీఎస్ కే రామకృష్ణారావు, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్రాజ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాలతో విలీన సమస్యలు, తదనంతర పరిణామాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రవేశాలకు తక్కువ సమయం, సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నట్టు గుర్తించారు.
విలీన ప్రక్రియపై భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు నియమించిన కేకే కమిటీ దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఆ తర్వాత కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై లెక్చరర్ల సంఘం నేతలు మధుసూదన్రెడ్డి, సురేశ్, టీపీజేఎంఏ అధ్యక్షుడు గౌరి సతీశ్ హర్షం వ్యక్తంచేశారు.