ఈ విధానంతో అమెరికాలో సత్ఫలితాలు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి
మనకు సహకరించేందుకు ‘బేయర్’ ఓకే
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి
బేయర్ కంపెనీని సందర్శించిన బృందం
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చేలా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలో ఎన్నో ఏండ్ల నుంచి ఈ విధానాన్ని అనుసరిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నారని చెప్పారు. అక్కడి బేయర్ విత్తన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరిశోధన జరిపి వాతావరణ, భూ పరిస్థితులకు అనుకూలమైన వివిధ రకాల విత్తనాలను అందిస్తున్నదన్నారు. వీటిలో తెలంగాణకు పత్తి, మొకజొన్న, కూరగాయల వంగడాలను అం దించిందేందుకు బేయర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు.
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుపై అధ్యయనం చేసేందుకు అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి నిరంజన్రెడ్డి బుధవారం సెయింట్ లూయీస్లో రాష్ట్ర ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రవీంద్రనాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులుతో కలిసి బేయర్ పత్తి విత్తన తయారీ, జన్యు పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచానికి బోల్గార్డ్-1, బోల్గార్డ్-2, బోల్గార్డ్-3 రకాల పత్తి విత్తనాలను అందించిన బేయర్ సంస్థ ఇప్పుడు నాలుగో రకం విత్తనాలను సిద్ధం చేసిందని, ఈ రకాలు అధిక సాంద్రత పద్ధతికి అనుకూలంగా ఉన్నాయని వివరించారు. తెలంగాణలో ఈ ఏడాది 20 వేల ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయనున్నామని, భవిష్యత్లో ఈ విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. పత్తి సాగుతోపాటు వ్యవసాయ యాంత్రీకరణను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.