హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): భవన, వ్యాపార, పరిశ్రమల యజమానులు సరైన అగ్నిమాపక వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు.14న ప్రారంభమైన అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి డాక్టర్ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అగ్నిమాపక శాఖకు అత్యుత్తమైన వస్తు, వాహన సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఫైర్ సేఫ్టీ ఏడీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. అగ్నిమాపకశాఖ వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 900 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సుమారు 70వేల మందికిపైగా ప్రత్యక్షంగా అవగాహన కల్పించినట్టు తెలిపారు.
విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతున్నందున యజమానులు ఎప్పటికప్పుడు వైర్లను మార్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ లక్ష్మీప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ జీవీ నారాయణరావు, రీజనల్ ఆఫీసర్ పాపయ్య, క్రెడాయ్ ప్రతినిధులు, హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్, పలు హోటళ్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.