ఎమ్మెల్యేలకు ఎర కేసును నిందితులు, బీజేపీ సవాల్ చేసిన పిటిషన్లపై సింగిల్ జడ్జి డిసెంబర్ 16న తీర్పును రిజర్వులో పెట్టారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఇతర ఆధారాలు ఉన్న సీడీ డిసెంబర్ 26న అందుకొని, అదేరోజు తీర్పు చెప్పారు. సింగిల్ జడ్జికి కనీసం ఆ మెటీరియల్ను పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు గడువు కూడా లేదు. వాస్తవానికి ఆ మెటీరియల్ అప్పటికే పబ్లిక్డొమైన్లో ఉన్నది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 12 గంటల్లోపే బీజేపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేయడాన్ని సింగిల్ జడ్జి ఏ దశలోనూ పట్టించుకోలేదు.
– రాష్ట్ర ప్రభుత్వ వాదన
ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకపోతే సీబీఐ, ఈడీ, ఐటీ కేసుల్లో ఇరుకోవాల్సి వస్తుందని నిందితులు బెదిరించినట్టుగానే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. ఇదే కేసును విచారిస్తున్న ఈడీ.. ఫిర్యాదుదారు రోహిత్రెడ్డిని వేధింపులకు గురిచేయడమే ఇందుకు నిదర్శనం.
–హైకోర్టులో ప్రభుత్వం వాదన
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ‘దేశంలో మరో పార్టీ పాలించకూడదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలి. దీనికోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలి. ఈ ఏకైక లక్ష్యంతో బీజేపీ అప్రజాస్వామిక విధానంలో పయనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి తిలోదకాలిస్తున్నది. ఇంకో పార్టీని అధికారంలో లేకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నేతలు కుట్ర చేశారు’ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సిట్, ఫిర్యాదుదారు రోహిత్రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై హైకోర్టులో గురువారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టీ తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. యావత్ దేశమంతా బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలన్న అప్రజాస్వామిక విధానంతో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ముందుకు వెళుతున్నదని, ఆ క్రమంలోనే ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్ర జరుగుతున్నదని, దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జడ్జికి రోస్టర్ లేకపోయినా కేసును విచారించారని తప్పుపట్టారు. కాబట్టి ఆ తీర్పును రద్దు చేయాలని కోరారు. సీఎం నిర్వహించిన ఒకే ఒక విలేకరుల సమావేశాన్ని ఆసరాగా తీసుకొని సిట్ను రద్దు చేసి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర గురించి ప్రజలకు వివరించేందుకే సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర వ్యవహారంపై సుప్రీంకోర్టు పీవీ నర్సింహారావు కేసులో ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. సాంకేతిక వ్యవస్థ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తున్నదని, అలాంటప్పుడు సీల్డ్కవర్లో విషయాలు ఉండాలని కోరుకోవడం సరికాదని అన్నారు. సీఎం మీడియాకు చెప్పిన విషయాలన్నీ కోర్టుల్లో దాఖలైన కేసుల్లో ఉన్నవేనని, కొత్తగా ఏమీ చెప్పలేదని తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీ చీఫ్గా కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించి వాస్తవాలను ప్రజలకు చెప్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన కుట్ర గురించి ప్రజలకు వివరించడం తప్పుకాదన్నారు. అంతా ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, పంచనామాల్లో ఉన్న విషయాలేనని, ఇవేవో లీక్ అయ్యాయంటూ సీబీఐ దర్యాప్తునకు ఇవ్వడం చెల్లదన్నారు.
పోలీస్ వ్యవస్థనే దెబ్బతీసేలా ఉంది
టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం నడుస్తున్నదని, కీలక వ్యక్తుల చర్యలు అక్రమ మార్గంలో ఉన్నప్పుడు దర్యాప్తును అడ్డుకోరాదని దవే చెప్పారు. వ్యవస్థలను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలన్నారు. సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉన్నదన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసుతో తమకు సంబంధం లేదంటూనే బీజేపీ రిట్ దాఖలు చేసి నిందితులకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. సీబీఐకి కేసు దర్యాప్తు ఇవ్వడం పోలీసు వ్యవస్థను దెబ్బతీయడమేనని అన్నారు. సిట్ ఆడియో, వీడియో, ఫోన్ చాటింగ్ తదితర కీలక సమాచారాన్ని సేకరించి దర్యాప్తును సమర్థంగా నిర్వహిస్తుంటే కేసును సీబీఐకి బదిలీ చేయడం అన్యాయమని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఇస్తామని ఎర చూపితే తీవ్రంగా పరిగణించకుండా సిట్ దర్యాప్తును రద్దు చేయడం దారుణమని అన్నారు. రాజకీయ బాండ్ల రూపంలో పార్టీలకు డబ్బులు బాగా వస్తున్నాయని, ఆ మొత్తం చెల్లింపులు పెద్ద పనేమీ కాదని చెప్పారు.
మొదటినుంచి దర్యాప్తు కోరడం విడ్డూరమే
దర్యాప్తును మొదటినుంచి ప్రారంభించాలని నిందితులు కోరడం విడ్డూరంగా ఉన్నదని దవే పేర్కొన్నారు. ఇలాంటి అభ్యర్థనను ఇప్పుడే వింటున్నట్టు చెప్పారు. సిట్ దర్యాప్తును రద్దు చేయాలని ఎవరూ కోరలేదని గుర్తు చేశారు. అడగకపోయినా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు, సుప్రీంకోర్టులకు లేదని తెలిపారు. పోలీసు దర్యాప్తును అడ్డుకునే అధికారం కోర్టులకు లేదని చెప్పారు.
సీఎం మీడియాకు కొత్తగా ఏమీ చెప్పలేదు
సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి సీడీ విడుదల చేశారని సింగిల్ జడ్జి ఎత్తి చూపడాన్ని దవే తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని, సిట్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లల్లో సీఎం కేసీఆర్ను ప్రతివాదిగా చేయలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు సీఎం మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల గురించి సింగిల్ జడ్జి తీర్పులో ప్రస్తావించకూడదని చెప్పారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఆ అంశాన్నే ప్రధానంగా ఎంచుకోవడం చట్ట వ్యతిరేకం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ను ప్రతివాదిగా చేయకపోవడం పిటిషనర్ల తప్పిదమైతే.. ఆయన వాదన ఏమిటో కౌంటర్ పిటిషన్ లేకుండా సింగిల్ జడ్జి వీడియో సీడీల అంశాన్నే ప్రధాన తప్పిదంగా పేరొంటూ తీర్పు వెలువరించడం న్యాయ విరుద్ధమని చెప్పారు. ఎమ్మెల్యేల ఎర కేసుకు చెందినవని చెప్తున్న వీడియోల సీడీ వంటివి సీఎం ఇచ్చారో లేదో కూడా నిర్ధారణ కాలేదని తెలిపారు. సింగిల్ జడ్జి ఇవేమీ నిర్ధారణ కూడా చేసుకోకుండానే సిట్ను రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ ఇచ్చిన తీర్పుకు చట్టబద్ధత లేదని, ఈ మేరకు అప్పీల్ పిటిషన్లల్లో ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పాలని కోరారు.
అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి
కోట్ల రూపాయలను ఇస్తామని ఎర చూపిం చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని రోహిత్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ పబ్లిక్ డొమైన్లో లభ్యమయ్యాయని దవే గుర్తుచేశారు. మొయినాబాద్ ఫాంహౌస్లో ఎమ్మెల్యేల ఎర కేసు ఘటన తర్వాత పోలీసులు జరిపిన పంచనామా, ఎఫ్ఐఆర్ నమోదు వంటివి పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు సీఎం ఇచ్చారని నిందితులు, బీజేపీ ఆందోళన వ్యక్తంచేయడంలో అర్థం లేదని అన్నారు. అదే విషయాన్ని సింగిల్ జడ్జి ఆమోదించడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. సీఎంను ప్రతివాదిగా చేర్చి ఆయన వాదన కూడా విన్న తర్వాత తీర్పు చెప్పి ఉంటే దానికి చట్టబద్ధత ఏర్పడుతుందని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసును నిందితులు, బీజేపీ సవాల్ చేసిన పిటిషన్లపై సింగిల్ జడ్జి డిసెంబర్ 16న తీర్పును రిజర్వులో పెట్టారని, అయితే, ఆ ఘటనకు చెందిన వీడియోలు, ఆడియోలు ఇతర ఆధారాలు ఉన్న సీడీని డిసెంబర్ 26న తీసుకొని, అదేరోజు తీర్పు చెప్పారని గుర్తుచేశారు. సింగిల్ జడ్జి ఆ మెటీరియల్ను పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు గడువు కూడా లేదన్నారు. వాస్తవానికి ఆ మెటీరియల్ అప్పటికే పబ్లిక్డొమైన్లో ఉన్నదని గుర్తుచేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 12 గంటల్లోపే బీజేపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేయడాన్ని సింగిల్ జడ్జి ఏ దశలోనూ పట్టించుకోలేదని తెలిపారు.
రోహిత్ రెడ్డి చెప్పిందే సీఎం చెప్పారు
సీఎం కేసీఆర్ గత నవంబర్ 3న నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్తగా ఏమీ చెప్పలేదని దవే తెలిపారు. రోహిత్రెడ్డి మీడియాకు చెప్పిన విషయాలనే సీఎం కూడా చెప్పారని అన్నారు. సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహించి సామన్య ప్రజలకు వాస్తవాలు చెప్తే తప్పు లేదని అన్నారు. అధికారపార్టీకి చెందిన సభ్యులను కొనేందుకు ప్రయత్నించడం ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేయడమే అవుతుందని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లోనే కోర్టులు నేరాభియోగాలపై దర్యాప్తు సంస్థలను మార్చేందుకు వీలుందని అన్నారు. ఇకడి కేసులో అసాధారణ పరిస్థితులు ఏమీ లేవన్నారు. జడ్జికి రోస్టర్ లేకపోయినా కేసు విచారించి తీర్పు చెప్పారని, చట్ట వ్యతిరేకంగా ఉన్న తీర్పును రద్దు చేయాలని కోరారు. సిట్ దర్యాప్తు యథాతథంగా కొనసాగేలా సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరారు.
దర్యాప్తును నిజాయితీగా ఎదురొనాలి
పబ్లిక్ డొమైన్లో మెటీరియల్ ఉంటే నిందితులకు వచ్చిన నష్టమేమిటని దవే ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు నిజాయితీగా సిట్ దర్యాప్తును ఎదుర్కోవాలని, అలాకాకుండా నిందితులే ఫలానా దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేయాలని కోరడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. వాళ్ల అభ్యర్థనకు అనుగుణంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పోలీసులు పనిచేస్తారనే అనుమానాన్ని వ్యక్తం చేసే బీజేపీ, నిందితులు.. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న అంశాన్ని విస్మరించారని తెలిపారు. ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదిస్తూ.. నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లని చెప్పారు. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆసారం కూడా లేదన్నారు. తదుపరి వాదనలు శుక్రవారం కొనసాగనున్నాయి. కేసు దర్యాప్తులో ఉన్నందున ఈ దశలో మధ్యంతర ఉత్తర్వుల జోలికి వెళ్లబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఫిర్యాదుదారునే ఈడీ వేధిస్తున్నది
ఫిర్యాదుదారు రోహిత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకపోతే సీబీఐ, ఈడీ, ఐటీ కేసుల్లో ఇరుకోవాల్సి వస్తుందని బెదిరించినట్టుగానే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయని చెప్పారు. ఇదే కేసును విచారణ చేపట్టిన ఈడీ ఫిర్యాదుదారు రోహిత్రెడ్డినే వేధింపులకు గురిచేయడం ప్రారంభించిందని తెలిపారు. నిందితులు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఇస్తామని ఆశ చూపారని, దీంతో రోహిత్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసులు ఒక పథకం ప్రకారం వలపన్ని నిందితులను ప్రత్యక్షంగా పట్టుకున్నారని చెప్పారు. సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడం చెల్లదన్నారు. ఫిర్యాదుదారు వాదనలు వినకుండానే ఇతరులను నిందితులుగా చేర్చాలని మెమో దాఖలుచేస్తే ఏసీబీ కోర్టు, హైకోర్టు కొట్టేశాయని చెప్పారు.
చీఫ్ జస్టిస్ కల్పించుకుని, ఆ నలుగురు ఎమ్మెల్యేలనే పార్టీ మారాలని నిందితులు ఎందుకు ప్రయత్నించారని, వాళ్ల మధ్య పరిచయాలు, సంబంధాలు ఉన్నాయా.. అని ప్రశ్నించారు. దీనిపై గండ్ర మోహన్రావు స్పందిస్తూ, నిందితులు వాళ్లంతట వాళ్లే స్వయంగా ముందుకు వచ్చి రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల చొప్పున ఇప్పిస్తామని, బీజేపీలో చేరాలని ప్రతిపాదన చేశారని చెప్పారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఎనిమిది రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించామని కూడా నిందితులు చెప్పారని గుర్తుచేశారు. నిందితుల తరఫు సీనియర్ న్యాయవాదులు మహేశ్ జెఠ్మలానీ, ఉదయ్ హుల్లా గతంలో వాదించినప్పుడు సీబీఐ దర్యాప్తు కోరలేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని మాత్రమే కోరారని గుర్తుచేశారు. ఫిర్యాదుదారు ప్రతివాదిగా ఉన్నప్పటికీ రోహిత్రెడ్డికి నోటీసు ఇవ్వలేదన్నారు. హకులు నిందితులకే కాదు, ఫిర్యాదుదారుకి కూడా ఉంటాయని చెప్పారు. సింగిల్ జడ్జి సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిస్తూ వెలువరించిన తీర్పును కొట్టేయాలని కోరారు.