హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వైద్యారోగ్యశాఖ శనివారం పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కళాశాలల ఏర్పాటు, అనుబంధ దవాఖానల అప్గ్రేడేషన్కు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం ప్రభుత్వం మొత్తం రూ.1,479 కోట్లు వ్యయం చేయనున్నది. ప్రతి కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. కాలేజీ భవనాల నిర్మాణాలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించగా, హాస్పిటల్ భవనాల అప్గ్రేడేషన్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు బాధ్యతలను టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించారు. ఆయా మెడికల్ కాలేజీలకు అటాచ్ చేస్తున్న దవాఖానలను వైద్యవిధాన పరిషత్తు పరిధి నుంచి డీఎంఈ పరిధికి బదిలీ చేశారు.
స్వరాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలే ఉన్నాయి. ఇందులో ఉస్మానియా, గాంధీ దవాఖానలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేకన్నా ముందే స్థాపించారు. అంటే.. 60 ఏండ్లలో తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం మూడు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మొదటి విడతలో ప్రభుత్వం మహబూబ్నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో నాలుగు, రెండో విడుతగా.. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు మూడోవిడతగా మరో 8 వైద్య కాలేజీలు మంజూరుచేసింది. తద్వారా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 25కు పెరుగనున్నది. ఇందులో 20 కాలేజీలను ఎనిమిదేండ్లలోనే ఏర్పాటుచేయడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం.
నాగర్కర్నూల్ వైద్య కళాశాలకు అనుమతి
150 సీట్లకు ఎన్ఎంసీఅనుమతి
ఈ సంవత్సరం నుంచే తరగతులు
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరుచేసింది. 150 ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కళాశాల ఏర్పాటుకు గతంలో దరఖాస్తు చేయగా ఇటీవల ఎన్ఎంసీకి చెందిన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఏఆర్బీ) బృందం నాగర్కర్నూల్ను సందర్శించింది. భవనాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, వసతిగృహాలు, దవాఖాన వసతులు, వైద్యసిబ్బంది, నర్సింగ్ సిబ్బంది తదితర వివరాలను తనిఖీ చేసింది. వీరి నివేదిక మేరకు వైద్య కళాశాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్టు ఎన్ఎంసీ తెలిపింది. 2022-23 విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభించవచ్చని స్పష్టంచేసింది.
జనగామ వైద్య కళాశాలకు అనుమతులు
సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా కృతజ్ఞతలు
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): జనగామలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు, అనుబంధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వు కాపీని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డిలకు అందజేశారు. వెంటనే జనగామలో మెడికల్ కాలేజీ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం పట్ల వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.